తమిళనాడు సీఎం పళని స్వామికి షాక్... సీబీఐ ఎంక్వైరీకి హైకోర్టు ఆదేశం
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళని స్వామి చిక్కుల్లో పడనున్నారా..? అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. తమిళనాడు రాష్ట్ర హైవే శాఖలో అవినీతి చోటుచేసుకున్నట్లుగా ఆరోపణలు వచ్చాయి. కాంట్రాక్టులు ఇవ్వడంలో భారీ ఎత్తున డబ్బులు చేతులు మారాయనేది ప్రధాన ఆరోపణ. ఈ క్రమంలోనే మద్రాసు హైకోర్టులో డీఎంకే దాఖలు చేసిన పిటిషన్ను విచారణ చేసిన న్యాయస్థానం సీబీఐ ఎంక్వైరీ వేసింది. రాష్ట్ర హైవే పోర్ట్ ఫోలియో సీఎం పళని స్వామి వద్దే ఉంది.
హైవే డిపార్ట్మెంట్లో అవినీతి చోటుచేసుకుందన్న ఆరోపణలపై విచారణ చేసి కోర్టుకు ప్రాథమిక నివేదిక సమర్పించాల్సిందిగా సీబీఐని ఆదేశించింది. మూడు నెలల సమయంలో దీన్ని పూర్తి చేయాలని కోర్టు సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది. కేసుకు సంబంధించిన విషయాలు సీబీఐకి ఇవ్వాలని డైరెక్టొరేట్ ఆఫ్ విజిలన్స్ అండ్ యాంటీ కరప్షన్ వింగ్ను సూచించింది. అక్టోబర్ 9న హైకోర్టుకు డీవీఏసీ రిపోర్టు సమర్పించిందిం. ఇందులో సీఎం పళని స్వామికి ఎలాంటి సంబంధం లేదని తెలిపింది.
సిఎం రమేష్ నివాసం, కార్యాలయాలపై ఐటి దాడులు
అంతకుముందు డీఎంకే పార్టీ సీఎం పళని స్వామి అవినీతికి పాల్పడ్డాడని పేర్కొంటూ డీవీఏసీ ఫిర్యాదు నమోదు చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. హైవేల కాంట్రాక్టులన్నీ పళనీ స్వామి బంధువులకే వెళ్లాయని ఇక్కడ చాలా అవినీతి చోటుచేసుకుందంటూ చెబుతూ ఈ ఏడాది జూన్లో డీవీఏసీకి ఫిర్యాదు చేసినట్లు డీఎంకే పిటిషన్లో పేర్కొంది.అయితే ఎలాంటి చర్యలు తీసుకోలేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చింది డీఎంకే.
ఈ ఏడాది జూలైలో ఇన్కంటాక్స్ శాఖ కాంట్రాక్టర్ల ఆస్తులపై దాడులు నిర్వహించిందని ఇందులో ఎస్పీకే అండ్ కో ఎక్స్ప్రెస్వే ప్రైవేట్ లిమిటెడ్ అధినేత నాగరాజన్ సెయ్యాదురై ఆస్తులపై కూడా ఐటీ దాడులు చేసిందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు పిటిషనర్. నాగరాజన్ ముఖ్యమంత్రి పలనిస్వామికి దగ్గరి బంధువు. ఆసమయంలో ఐటీశాఖ రూ.170 కోట్లు లెక్క తేలని డబ్బును స్వాధీనం చేసుకుందని చెప్పారు. దీంతో పాటు రూ.100 కోట్లు విలువ చేసే బంగారాన్ని సైతం రికవర్ చేసుకుందని చెప్పారు. దాదాపు 36 గంటల పాటు సోదాలు జరిగాయని వెల్లడించారు. దీంతో డీవీఏసీ శాఖ సాంకేతికంగా సీఎం కిందకు వస్తుంది కాబట్టి తమకు నమ్మకం లేదని ఏదైనా స్వతంత్ర విచారణ సంస్థతో ఎంక్వైరీ చేయించాలని డీఎంకే పిటిషన్లో కోరిన నేపథ్యంలో కోర్టు సీబీఐ ఎంక్వైరీకి ఆదేశించింది.