ఆర్ కే నగర్ ఉప ఎన్నికలు: నకిలీ ఓటర్లు కథ చూడండి, ఈసీకి హైకోర్టు ఆదేశాలు!
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ప్రాతినిధ్యం వహించిన ఆర్ కే నగర్ శాసన సభ నియోజక వర్గంలో భారీ మొత్తంలో నకిలీ ఓటర్లు ఉన్నారని ఆరోపణలు రావడంతో మద్రాసు హైకోర్టు స్పందించింది. ఆర్ కే నగర్ లో నకిలీ ఓటర్ల కథ చూడాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఆర్ కే నగర్ శాసన సభ నియోజక వర్గంలో ఉన్న నకిలీ ఓటర్లను గుర్తించి వెంటనే వారి పేర్లను తొలగించాలని బుధవారం మద్రాసు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆర్ కే నగర్ లో భారీ సంఖ్యలో నకిలీ ఓటర్లు ఉన్నారని డీఎంకే పార్టీ ఆరోపించింది.
ఆర్ కే నగర్ లోని నకిలీ ఓటర్ల పేర్లు తొలగించాలని అక్కడ జరుగుతున్న ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న డీఎంకే పార్టీ అభ్యర్థి మరుదు గణేష్ మద్రాసు హై కోర్టును ఆశ్రయించారు. బుధవారం మద్రాసు హైకోర్టు న్యాయమూర్తులు శివగాననమ్, జస్టిస్ రవిచంద్రబాబు పిటిషన్ విచారణ చేశారు.
ఆర్ కే నగర్ శాసన సభ నియోజక వర్గంలో విచారణ చేపట్టి వెంటనే అక్కడ ఉన్న నకిలీ ఓటర్ల పేర్లు గుర్తించి వాటిని తొలగించి కఠిన చర్యలు తీసుకోవాలని మద్రాసు హైకోర్టు ఎన్నికల కమిషన్ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
చెన్నైతో పాటు ఇతర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న పలువురు ఉప ఎన్నికల సందర్బంగా ఆర్ కే నగర్ నియోజక వర్గంలో ఓటు వెయ్యడానికి ఓటర్ల జాబితాలో వారి పేర్లు నమోదు చేయించారని ఆరోపణలు ఉన్నాయి.