జయలలిత బ్లడ్ స్యాంపిల్స్ నివేదిక ఇవ్వండి, అపోలోకు హైకోర్టు ఆదేశం, అమ్మ కుమార్తె !
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత బ్లడ్ స్యాంపిల్స్ రిపోర్టు సమర్పించాలని మద్రాసు హైకోర్టు అపోలో ఆసుపత్రి యాజమాన్యానికి ఆదేశాలు జారీ చేసింది. 24 గంటల్లో జయలలిత బ్లడ్ స్యాంపిల్స్ నివేదిక సమర్పించాలని మద్రాసు హైకోర్టు బుధవారం సూచించింది.
జయలలిత కుమార్తె
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత కుమార్తె తానే అని, డీఎన్ఏ పరీక్షలు చేయించాలని బెంగళూరుకు చెందిన అమృత (37) మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. జయలలిత కుమార్తెను తానే అని నిరూపించుకోవడానికి అవకాశం ఇవ్వాలని మద్రాసు హైకోర్టుకు అమృత మనవి చేసింది.
అపోలోకు నోటీసులు
జయలలిత బ్లండ్ స్యాంపిల్స్ ఉంటే ఇవ్వాలని బెంగళూరుకు చెందిన అమృత ఆమె న్యాయవాదితో అపోలో ఆసుపత్రికి నోటీసులు పంపించారు. అయితే అపోలో ఆసుపత్రి నుంచి తనకు ఎలాంటి సమాధానం రాలేదని అమృత మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు.
స్యాంపిల్స్ ఇవ్వండి
జయలలిత దాదాపు రెండున్నర నెలలు అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2016 డిసెంబర్ 5వ తేదీ మరణించారు. ఆ సమయంలో బయోలాజికల్ పరీక్షల కోసం సేకరించిన స్యాంపిల్స్ నివేదికను గురువారం సమర్పించాలని మద్రాసు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ప్రభుత్వం కౌంటర్
జయలలిత కుమార్తె అంటూ బెంగళూరుకు చెందిన అమృత వేసిన పిటిషన్ కొట్టివేయాలని తమిళనాడు ప్రభుత్వం మద్రాసు హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. జయలలిత బెంగళూరుకు అనేక సార్లు వెళ్లారని, అయితే అమృతను ఎప్పుడూ ఆమె కలవలేదని తమిళనాడు ప్రభుత్వం వాదిస్తోంది.
అమ్మను కలిశాను
జయలలిత బెంగళూరులో అనేక సార్లు తనను కలిశారని, ఆమె కుమార్తె తానే అని బంధువులు చెప్పారని అమృత వాదిస్తోంది. తాను జయలలిత కుమార్తె అని నిరూపించుకోవడానికి డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాలని అమృత మద్రాసు హైకోర్టులో మనవి చేశారు. గురువారం అపోలో ఆసుపత్రి మద్రాసు హైకోర్టులో ఏం నివేదిక సమర్పిస్తుందో వేచిచూడాలి.