కాలేజ్ అమ్మాయిలతో వ్యభిచారం, లేడి ప్రొఫెసర్ మొబైల్ లో మంత్రులు, ఐఏఎస్ ల జాతకం!
చెన్నై: తమిళనాడులోని విరూద్ నగర్ జిల్లా పరుప్పుకోటైకి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ నిర్మలా దేవి అసాంఘిక కార్యకలాపాల వెనుక ఇద్దరు మంత్రులు, ఆరు మంది ఐఏఎస్ అధికారుల పాత్ర ఉన్నట్లు సీబీసీఐడీ విచారణలో వెలుగు చూసింది. వారందరికీ నిర్మలా దేవి నిత్యం ఫోన్లు చేయడం, గంటలు గంటలు జరిపిన సంభాషణలను సీబీసీఐడీ ఎస్పీ రాజేశ్వరి ఆధ్వర్యంలోని అధికారులు స్వాధీనం చేసుకుని విచారణ ముమ్మరం చేశారు. మాజీ ఐఏఎస్ అధికారి సంతానం నేతృత్వంలోని ప్రత్యేక కమిషన్ మదురై కామరాజర్ యూనివర్శిటి, పరుప్పుకోటైలోని దేవాంగర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ లో విచారణ చేస్తున్నారు.
కుప్పలు తెప్పలు ఫిర్యాదులు
అసిస్టెంట్ ప్రొఫెసర్ నిర్మలా దేవి మీద కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులు వస్తున్నాయి. ఇందుకు సంబంధించి ఓ పోలీసు అధికారి మీడియాతో మాట్లాడుతూ విద్యార్థినులను లైంగిక అవసరాలకు వాడుకుంటున్నారని ఉన్నత విద్యాశాఖకు గత నెలలోనే కొందరు అధికారులు ఫిర్యాదులు చేశారని అన్నారు.
అధికారుల నిర్లక్షం
విద్యాశాఖ అధికారులు నిర్మలా దేవి మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదని పోలీసు అధికారి ఆరోపించారు. ఆ నివేదికను గవర్నర్ కార్యదర్శి రాజగోపాల్ దృష్టికి తీసుకెళ్లారని, విచారణకు వచ్చిన ప్రత్యేక కమిషన్ చైర్మన్, మాజీ ఐఏఎస్ అధికారి సంతానంను అసిస్టెంట్ ప్రొఫెసర్లు కలిసి వినతిపత్రాన్ని ఇచ్చి యూనివర్శిటీలో జరుగుతున్న అక్రమాలపై అనేక ఫిర్యాదులు చేశారని వివరించారు.
ఇద్దరు మంత్రులు
అసిస్టెంట్ ప్రొఫెసర్ నిర్మలా దేవి మొబైల్ ఫోన్లో ఇద్దరు మంత్రులు, ఆరు మంది ఐఏఎస్ అధికారులు, ఉన్నత విద్యాశాఖలో పనిచేసే కొందరు సీనియర్ అధికారులతో సంభాషణలు, ఫొటోలతో ఉన్న ఆధారాలను సీబీసీఐడీ అధికారులు స్వాధీనం చేసుకుని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారని సమాచారం.
యూనివర్శిటీలో పట్టు
మదురై కామరాజర్ యూనివర్సిటీలో పట్టుదొరకని కాలంలో నిర్మలా దేవి పలువురితో సన్నిహితంగా తిరిగారని, విద్యార్థినులతో రాత్రిపూట విందులు ఏర్పాట్లు చేసి జల్సాలు చేశారని మాజీ ఐఏఎస్ అధికారి సంతానం విచారణలో వెలుగుచూసింది.
అమ్మాయిలకు బంగారు నగలు
విద్యార్థినులను లైంగికంగా లొంగదీసుకునేందుకు వారికి నిర్మలా దేవి పంజాబి డ్రస్ లు, చీరలు, వ్యానిటీ బ్యాగ్ లు, బంగారు కమ్మలు, చేతి రింగ్ లు కొనిచ్చారని విచారణలో వెలుగు చూసింది. ఈ విషయాలకు సంబంధించి కాలేజ్ లో మాజీ ఐఏఎస్ అధికారి సంతానం పలువురు విద్యార్థినులను విచారించి వివరాలు సేకరించారని, ఇంకా విచారణ కొనసాగుతోందని ఓ అధికారి తెలిపారు.