ఛోటా రాజన్: తీహార్ జైల్లో సాయుధ బలగాలు
తీహార్: తీహార్ జైల్లో ఉన్న మాఫియా డాన్ ఛోటా రాజన్ కు కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. 10 మంది సాయుధ బలగాలు ఛోటా రాజన్ ఉంటున్న బ్యారెక్ దగ్గర 24 గంటల పాటు భద్రతా ఏర్పాట్లలో నిమగ్నం అయ్యారు.
ఇతర ఖైదీలను అటు వైపు వెల్లకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. తీహార్ జైల్లోనే ఛోటా రాజన్ ను మా షార్ప్ షూటర్స్ అంతం చేస్తారని మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం ప్రధాన అనుచరుడు ఛోటా షకీల్ హెచ్చరించిన నేపధ్యంలోనే భద్రత మరింత పెంచారు.
ఛోటా రాజన్ భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న ప్రత్యేక అధికారి రోజుకు రెండు సార్లు తీహార్ జైలు సిబ్బందితో పాటు సాయుధ బలగాలతో సమావేశం అయ్యి చర్చిస్తున్నారు. భద్రతా ఏర్పాట్ల కారణంగానే ఛోటా రాజన్ ను ముంబై తరలించడం లేదు.
ఛోటా షకీల్ ఇప్పటికే పలు సార్లు బహిరంగంగానే ఛోటా రాజన్ ను అంతం చేస్తామని బెదిరించిన విషయం తెలిసిందే. ఈ హెచ్చరికల వలన ఛోటా రాజన్ భద్రత విషయంలో అధికారులు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఛోటా రాజన్ కు ప్రతి రోజు ఇచ్చే ఆహారాన్ని మొదట పరిశీలించిన తరువాత అతనికి ఇస్తున్నారు. అనారోగ్యంతో ఉన్న ఛోటా రాజన్ ప్రతి రోజు ఉదయం వాకింగ్, యోగా చేస్తున్నాడు. ఆ సమయంలో అతనికి సాయుధ బలగాలు రక్షణగా ఉంటున్నాయి.
ఛోటా రాజన్ ను కలవడాకి వచ్చే వారికి ముందుగా పలు సూచనలు ఇస్తున్నారు. నియమాలు పాటించి ఛోటా రాజన్ తో మాట్లాడాలని ముందుగానే హెచ్చరిస్తున్నారు. ఛోటా రాజన్ ను కలవడానికి వచ్చే వారిని క్షుణ్ణంగా పరిశీలించిన తరువాత లోపలికి అనుమతి ఇస్తున్నారు.
ఛోటా రాజన్ తో మాట్లాడే సమయంలో అక్కడ అత్యాధునిక ఆయుధాలతో భద్రతా సిబ్బంది ఉంటారని అధికారులు తెలిపారు. 2015 అక్టోబర్ 26వ తేదిన ఇండోనేషియాలోని బాలీలో స్థానిక పోలీసులు ఛోటా రాజన్ ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.