మ్యాగీ నూడుల్స్ సురక్షితం కాదు: ఢిల్లీలో చర్యలు, కేరళలో నిషేధం
న్యూఢిల్లీ: మ్యాగీ నూడుల్స్ తయారీదారు నెస్లేపై రోజురోజుకీ ఉచ్చు మరింతగా బిగుస్తోంది. ఢిల్లీలో మ్యాగీ నూడుల్స్పై పరీక్ష చేసిన అధికారులు సురక్షితంకాదని తేల్చేశారు. దీంతో నెస్లే కంపెనీపై చర్యలు తీసుకోవడానికి ఢిల్లీ ప్రభుత్వం యోచిస్తోంది. తమ నూడుల్స్లో వాడుతున్న రసాయనాలు అనుమతించిన మోతాదులోనే ఉన్నాయని పరీక్షల్లో తేలినట్లు నెస్లే ప్రకటించిన 24 గంటల్లోనే ఢిల్లీ ప్రభుత్వం పరీక్షల్లో సురక్షితం తేల్చిచెప్పడం గమనార్హం.
కేంద్ర ప్రభుత్వం కూడా మ్యాగీ నూడుల్స్పై చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అమితాబ్ బచ్చన్, మాధురీ దీక్షిత్, ప్రీతి జింటాలపై ఇప్పటికే బారాబంకిలో కేసు నమోదైంది. ఈ మేరకు కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ మంగళవారం ఒక ప్రకటన చేశారు. నూడుల్స్ కంపెనీ నెస్లేకు ప్రచారకర్తలుగా ఉన్న బాలీవుడ్ స్టార్లు అమితాబ్ బచ్చన్, మాధురీ దీక్షిత్, ప్రీతీ జింటాలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని బీహార్ కోర్టు ఆదేశించింది.
బీహార్లోని ముజఫర్పూర్లో ఒక లాయర్ దాఖలు చేసిన పిటిషన్ మేరకు అదనపు చీఫ్ జుడిషియల్ మేజిస్ర్టేట్ రామచంద్ర ప్రసాద్ వారిపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలని కాజీ మొహమ్మద్ పూర్ పోలీస్ స్టేషన్ను ఆదేశించారు. అడ్వొకేట్ సుధీర్ కుమార్ ఓజా ముజఫర్పూర్లోని లెనిన్ చౌక్లో మ్యాగీ కొని తిన్నారు. ఆ తరువాత తనకు దాని వల్లనే అస్వస్థత చేసిందంటూ ఆయన కోర్టులో కేసు వేశారు.
దీంతో నూడుల్స్ ప్రమాణాలపై అనుమానాలు తలెత్తాయి. వెంటనే నెస్లే కంపెనీ, ముగ్గురు నటులపై కేసు పెట్టాడు. ఐపీసీలోని 270,273,276, 420 సెక్షన్ల కింద కేసు నమోదైంది. నెస్లే ఇండియా కంపెనీ మాత్రం సొంత లేబొరెటరీల్లో పరీక్షలు నిర్వహించి ఎలాంటి లోపాలు లేవని చెబుతోంది. మ్యాగీ నూడుల్స్ వివాదం ప్రక్క రాష్ట్రాలకు పాకింది.
కేరళలో మ్యాగీ నూడుల్స్ నిషేధించారు. తెలంగాణలోనూ మ్యాగీ శాంపుళ్లపై హైదరాబాద్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం)లో పరీక్షలు చేయిస్తోంది. పశ్చిమ బెంగాల్ ఫుడ్ డిపార్ట్మెంట్ బుధవారం సమావేశమై మ్యాగీ నూడుల్స్ వ్యవహారంపై చర్చించనుంది. కాగా అనేక రాష్ట్రాల్లో శ్యాంపుల్స్ సేకరించి లేబొరెటరీలకు పంపారు. మ్యాగీ నూడుల్స్పై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం బుధవారం నిర్ణయం తీసుకోనుంది.
కర్ణాటకలోనూ ప్రభుత్వం ఇదే తరహా పరీక్షలకు సిద్ధమవుతోంది. హర్యానాలోనూ బీజేపీ ప్రభుత్వం మ్యాగీ నూడుల్స్ శాంపుళ్లను రాష్ట్ర వ్యాప్తంగా సేకరిస్తోంది. సేకరించిన శ్యాంపుల్స్ను ల్యాబ్లకు పాంపాల్సిందిగా ఆదేశాలు ఇచ్చినట్టు హర్యానా ఆరోగ్య మంత్రి అనిల్ విజ్ వెల్లడించారు. డిపోల నుంచి స్టాక్ను వాపసు తీసుకోవల్సిందిగా కంపెనీని ఆదేశించామని ఆయన అన్నారు.