నెస్లేకు మ్యాగీ దెబ్బ: 10 వేల కోట్ల నష్టం, గ్లోబల్ సీఈఓ పాల్ వివరణ
దేశ వ్యాప్తంగా వివాదాస్పదమైన మ్యాగీ నూడుల్స్ వ్యవహారం నెస్లే ఇండియాపై కోలుకోలేని దెబ్బ కొట్టింది. నెస్లే ఇండియా సంస్ధ మార్కెట్ క్యాప్ను ఏకంగా రూ. 10 వేల కోట్ల నష్టాల్ని చవి చూసేలా చేసింది. దేశ వ్యాప్తంగా మ్యాగీ నూడుల్స్ స్టాక్ను వెనక్కి తీసుకుంటున్నామని నెస్లే ప్రకటించిన నేపథ్యంలో శుక్రవారం స్టాక్ మార్కెట్లో నెస్లే షేరు 5 శాతం మేరకు ఈక్విటీ పతనమైంది.
నెస్లే మొత్తం ఆదాయంలో 20 శాతం వరకూ మ్యాగీ నూడుల్స్ అమ్మకాల నుంచే వస్తున్న నేపథ్యంలో పెట్టుబడిదారుల సెంటిమెంట్ దెబ్బతిందని నిపుణులు అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది మార్చి 10వ తేదీన రూ. 7,505 వద్ద 52 వారాల గరిష్ఠ స్ధాయిలో ఉన్న ఈక్విటీ ధర, గురువారం ఏకంగా రూ. 4,761కి పడిపోయింది.
మొత్తం మీద గడచిన కొన్ని రోజులుగా నెలకొన్న మ్యాగీ నూడుల్స్ వివాదంతో నెస్లే కంపెనీ మార్కెట్ క్యాప్ రూ. 10 వేల కోట్లకు నష్టపోయింది. రోజుల వ్యవధిలోనే 15 శాతానికి పైగా నెస్లే ఇండియా షేరు పడిపోయింది. ప్రస్తుతం నెస్లే ఇండియా షేరు ఈక్విటీ ధర 6,020 వద్ద ట్రేడ్ అవుతుంది.
మ్యాగీ వివాదంపై నెస్లే గ్లోబల్ సీఈఓ పాల్ వివరణ
దేశ వ్యాప్తంగా నెలకొన్న మ్యాగీ నూడుల్స్ వివాదంపై నెస్లే గ్లోబల్ సీఈఓ పాల్ వివరణ ఇచ్చారు. మ్యాగీ నూడుల్స్ వివాదంలో ప్రజలు గందరగోళానికి గురయ్యారయాని తెలిపారు. మ్యాగీ నూడుల్స్ తినడం వల్ల ఎలాంటి నష్టం లేదని వివరించారు. మ్యాగీ నూడుల్స్పై వస్తున్న వివాదాల కారణంగా భారతీయ మార్కెట్ల నుంచి ఉత్పత్తిని వెనక్కి తీసుకుంటున్నామని చెప్పారు.
30 ఏళ్లుగా భారతీయులు మా ఉత్పత్తిని నమ్మారని అన్న ఆయన, దేశ వ్యాప్తంగా మ్యాగీని రికవరీ చేస్తున్నట్లు ప్రకటించారు. దేశంలో ఎక్కడైతే ఆందోళనలు నిర్వహిస్తున్నారో అక్కడి నుంచి సరుకుని వెనక్కి రప్పిస్తున్నట్లు పేర్కొన్నారు. మ్యాగీ నూడుల్స్లో మ్యాగీలో మోనో సోడియం గ్లూకోమేటే లేదని తెలిపారు.
భారత ప్రజల నమ్మకాన్ని గెలుచుకుని మళ్లీ మార్కెట్లోకి ప్రవేశిస్తామని తెలిపారు. ఈసారి NO MSG లేబుల్ తో మార్కెట్లోకి వస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
మ్యాగీ నూడుల్స్లో అనుమతించిన స్థాయికన్నా మించి ఆరోగ్యానికి హాని చేసే సీసం లాంటి పదార్థాలున్నట్లు శాంపిల్స్ పరీక్షలో తేలడంతో ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, హర్యానా, కర్నాటక, లాంటి అనేక రాష్ట్రాలు మ్యాగీ నూడుల్స్ అమ్మకాలపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే.