రూ. 320 కోట్ల మ్యాగీ నూడుల్స్ బూడిద
న్యూఢిల్లీ: నెస్లె ఇండియా కంపెనీ తయారు చేసిన రూ. 320 కోట్ల విలువైన 27,420 టన్నుల మ్యాగీ నూడుల్స్ బూడిద చెయ్యడానికి రంగం సిద్దం అయ్యింది. స్వయంగా ఆ కంపెనీ ప్రతినిధులు ఈ విషయం వెల్లడించారు. మ్యాగీ నూడుల్స్ నిషేదించడంతో నెస్లె ఇండియా ఈ నిర్ణయం తీసుకుంది.
మార్కెట్ లు, వ్యాపార భాగస్వాముల దగ్గర రూ. 210 కోట్ల విలువైన స్టాక్ ఉందని, ఫ్యాక్టరీలు, గోదాములలో రూ. 110 కోట్ల విలువైన నిల్వలు ఉన్నాయని బాంబే స్టాక్ ఎక్ట్సేంజ్ కు సమాచారం ఇచ్చింది. మార్కెట్, ఫ్యాక్టరీలలోని నిల్వలను ఉపసంహరించుకుంటున్నామని వెల్లడించారు.
మ్యాగీ నూడుల్స్ లో సీసం, మోనోసోడియం గ్లుటామేట్ స్థాయిలు పరిమితి కంటే ఎక్కువగా ఉన్నాయని గుర్తించిన భారత ఆహార భద్రతా ప్రమాణ సంస్థ మ్యాగీ నూడుల్స్ ను నిషేదించింది. ఈనెల 5వ తేదిన మ్యాగీ నూడుల్స్ ను నిషేధిస్తున్నామని ఆదేశాలు జారీ చేసింది.
అదే సమయంలో మ్యాగీ నూడుల్స్ ను మార్కెట్ ల నుండి వెనక్కి తీసుకుంటున్నామని నెస్లె ఇండియా ప్రకటించింది. మ్యాగీ నూడుల్స్ నిషేదంపై స్టే ఇవ్వాలని నెస్లె ఇండియా బాంబే హైకోర్టును ఆశ్రయించింది. అయితే స్టే ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది. ఈ సందర్బంలో కొన్ని సిమెంట్ ఫ్యాక్టరీలలో మ్యాగీ నూడుల్స్ ను బూడిదచెయ్యడానికి నెస్లె ఇండియా సిద్దం అయ్యింది.