నిషేధం: రిక్షాలు తొక్కుతున్న ‘మ్యాగీ’ కార్మికులు
న్యూఢిల్లీ: మ్యాగీ వివాదం అనంతరం ప్రభుత్వం నిషేధం విధించిన నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో నెస్లే కంపెనీకి చెందిన ఉద్యోగులు, కార్మికులు ఒక్కసారిగా రోడ్డున పడ్డారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని నెస్లే కంపెనీకి చెందిన రుద్రపూర్ ప్లాంట్లో పనిచేసే కార్మికులందరు ఉద్యోగాలు కోల్పోయారు.
ఉన్నపళాన నిరుద్యోగులైన దాదాపు 1,100మంది కార్మికులు ప్రస్తుతం రిక్షాలు లాగుతూ జీవితం గడుపుతున్నారు. మ్యాగీపై నిషేధం విధించక ముందు రుద్రపూర్ ప్లాంట్లో రోజుకు మూడు టన్నుల మ్యాగీని ఉత్పత్తి చేసేవారు.
ప్రస్తుతం మ్యాగీపై నిషేధం నడుస్తుండటంతో కార్మికులందరికీ పనిలేకుండా పోయింది. దీంతో వారంతా వివిధ రకాల పనులు చేస్తున్నట్లు తెలిపారు. అక్కడ పనిచేసే కార్మికులలో పక్క రాష్ట్రాల నుంచి వలస వచ్చిన వాళ్లు కూడా ఉన్నారు.
దీంతో వాళ్లు తిరిగి స్వరాష్ట్రానికి వెళ్లిపోతున్నారు. ఇటీవల బాంబే హైకోర్టు మ్యాగీపై నిషేధాన్ని ఎత్తివేయడంతో కార్మికులలో మళ్లీ ఆశలు రేకెత్తుతున్నాయని స్థానిక అధికారులు చెబుతున్నారు.