షాక్: మ్యాగీ నూడుల్స్ నాణ్యత పరీక్షలో ఫెయిల్, రూ.62 లక్షల ఫైన్
లక్నో: మ్యాగీ నూడుల్స్కు మరోసారి భారీ షాక్ తగిలింది.మ్యాగీ న్యూడుల్స్ నాణ్యత పరీక్షల్లో విఫలమైంది. దీంతో ఉత్తర్ప్రదేశ్ షాజహన్పూర్ కోర్టు నెస్లే ఇండియాకు భారీ జరిమానాను విధించింది.
షాజహన్పూర్ అదనపు జిల్లా మేజిస్ట్రేట్ కోర్టు మ్యాగి నూడుల్స్ పరిమితి కంటే ఎక్కువ బూడిద కంటెంట్ ఉందన్న ల్యాబ్ నివేదికను సమర్ధించింది. మ్యాగీ ఉత్పత్తులపై ఆగ్రహం వ్యక్తం చేసిన మేజిస్ట్రేట్ సంస్థకు రూ.62లక్షల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. ఇందులో రూ.45లక్షలను ముగ్గురు డిస్ట్రిబ్యూటర్లు రూ.15లక్షల చొప్పున, ఇద్దరు అమ్మకం దారులకు రూ.11లక్షలు చొప్పున చెల్లించాలని కోర్టు ఆదేశించింది.
నాసిరకం ఉత్పత్తులను అందించడం ద్వారా ప్రజల ఆరోగ్యంతో ఆడలాడుకోవటం ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించరాదని ఎడీఎం జేకే శర్మ వ్యాఖ్యానించారు.జిల్లా అధికారులు అందించిన సమాచారం ప్రకారం మాగి నూడుల్స్ , పాస్తా ఏడు నమూనాలను సేకరించి, 2015 లో లక్నోలో ఒక ప్రయోగశాలలో పరీక్ష కోసం పంపగా 2016 లో ఉత్తర ప్రదేశ్ ఆహార భద్రత మరియు ఔషధ నిర్వహణ (FSDA) కు నివేదికను సమర్పించింది.
అయితే, నెస్లే ఇండియా అధికార ప్రతినిధి మాట్లాడుతూ, మ్యాగి నూడుల్స్ వినియోగానికి 100శాతం సురక్షితంగా ఉన్నాయని పునరుద్ఘాటించారు. దీనికి సంబంధించి తమకు ఎలాంటి ఉత్తర్వులు రాలేదనీ, ఆర్డర్ పొందిన వెంటనే తక్షణమే అప్పీల్ చేస్తామన్నారు.