ఓవైపు కరోనా.. మరోవైపు భూకంపాలు.. భారత్కు క్లిష్ట పరిస్థితి.. హర్యానాలో కంపించిన భూమి...
హర్యానాలో శుక్రవారం(జూన్ 19) తెల్లవారుజామున భూకంపం సంభవించింది. రోహ్తక్ పట్టణానికి తూర్పు ఆగ్నేయంగా 15కి.మీ దూరంలో భూప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 2.3గా నమోదైంది. భూకంప కేంద్రం 5కి.మీ లోతున ఉన్నట్టు గుర్తించారు. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ ఈ వివరాలను వెల్లడించింది. భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ,ఆస్తి నష్టం జరగలేదని తెలుస్తోంది.
Recommended Video
మిజోరాంలోనూ నిన్న రాత్రి కంపించిన భూమి...
గురువారం(జూన్ 18) రాత్రి 7.28గం. సమయంలో ఈశాన్య రాష్ట్రం మిజోరాంలోనూ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత 5.0గా నమోదైంది. మిజోరాంలోని చంఫయ్ పట్టణానికి ఆగ్నేయంగా 98కి.మీ దూరంలో భూప్రకంపనలు సంభవించాయి.అయితే ఎటువంటి ప్రాణ,ఆస్తి నష్టం సంభవించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అటు మయన్మార్లోనూ కొద్ది సెకన్ల పాటు స్వల్పంగా భూమి కంపించినట్టు సమాచారం. అక్కడ 80కి.మీ లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు తెలుస్తోంది.
ఇటీవల గుజరాత్లోనూ..
ఇటీవలి కాలంలో స్వల్ప తీవ్రతతో భారత్లో తరుచూ భూకంపాలు సంభవిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. గుజరాత్లోని కచ్లో ఈ నెల 14,15న రెండు సార్లు స్వల్ప భూకంపం సంభవించింది.రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.5 నమోదు అయినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ పేర్కొంది. రాజ్కోట్కు వాయువ్య దిశలో 83 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. 24గంటల వ్యవధిలోనే రెండుసార్లు భూమి కంపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
ఢిల్లీ,నోయిడా,ఎన్సీఆర్ ప్రాంతాల్లోనూ...
ఇదే నెల 3న ఢిల్లీ,ఎన్సీఆర్,నోయిడా పరిసర ప్రాంతాల్లోనూ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత 3.2గా నమోదైంది. నోయిడాకు 19 కి.మీ ఆగ్నేయంలో భూకంపం సంభవించినట్టు సెంటర్ ఫర్ సీస్మోలజీ ప్రకటించింది. అయితే ప్రాణ,ఆస్తి నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. గత మే 29న కూడా ఢిల్లీ,నోయిడా,ఎన్సీఆర్,హర్యానా ప్రాంతాల్లో భూమి ఒక్కసారిగా కంపించింది. రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత 4.6 గా నమోదైంది.అయితే ఎటువంటి ప్రాణ,ఆస్తి నష్టం సంభవించలేదు.
ఓవైపు కరోనా.. మరోవైపు భూకంపాలు
ఓవైపు భారత్ కరోనాపై యుద్దం చేస్తుండగానే.. మరోవైపు తరుచూ భూకంపాలు సంభవిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. గతంలో ఎన్నడూ లేని రీతిలో కొద్ది రోజుల వ్యవధిలోనే పలుమార్లు భూకంపాలు సంభవించడం గమనార్హం. ఇప్పటివరకూ స్వల్ప తీవ్రతతోనే భూకంపాలు సంభవించడంతో ఎక్కడా ఎటువంటి ప్రాణ నష్టం,ఆస్తి నష్టం జరగలేదు. కానీ ఇలా వరుసగా భూకంపాలు రావడానికి కారణమేంటో తెలియాల్సి ఉంది.