మిజోరాంలో భూకంపం: 4.3గా తీవ్రత నమోదు, ఆందోళనలో జనం
న్యూఢిల్లీ: ఇటీవల కాలంలో దేశంలో ఏదో ఓ మూలన భూకంపాలు సంభవిస్తూనే ఉన్నాయి. ఎక్కువగా ఈశాన్య రాష్ట్రాలతోపాటు ఉత్తరాది రాష్ట్రాల్లోనూ ఈ భూకంపాలు సంభవిస్తున్నాయి. ఇప్పటికే కరోనా మహమ్మారితో భయాందోళనలో ఉన్న ప్రజలకు ఈ భూకంపాలు మరింత ఆందోళనలకు గురిచేస్తున్నాయి.
తాజాగా మిజోరాం రాష్ట్రంలో భూకంపం సంభవించింది. గురువారం మధ్యాహ్నం 2.28 గంటలకు మిజోరాంలోని ఈశాన్య లుండార్ ప్రాంతంలో భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టారు స్కేలుపై 4.3గా నమోదైంది.
భూకంప తీవ్రత తక్కువగా ఉండటంతో ఎలాంటి నష్టం వాటిల్లలేదు. భూమి స్వల్పంగా కంపించడంతో ప్రజలు భయంతో బయటకి పరుగులు తీశారు. మిజోరాంలోని చంపాయికి 23 కిలోమీటర్ల దూరంలో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. గత కొద్ది రోజుల క్రితమే మిజోరాంలో స్వల్ప తీవ్రతతో భూకంపం సంభవించిన విషయం తెలిసిందే.