యూపీ ఎఫెక్ట్: రైతు ఆందోళనలు, దిగొచ్చిన ఫడ్నవీస్
ముంబై: కిందటేడాది తీవ్ర వర్షభావం పరిస్థితులను ఎదుర్కొన్న మహారాష్ట్ర రైతులకు 2016 అక్టోబర్లో కురిసిన వర్షాలతోపాటు మంచి వర్షాకాలం రావడంతో మరాఠీ రైతుల కష్టాలు గట్టెక్కాయని అంతా భావించారు.
ప్రత్యేకించి మరఠ్వాడ ప్రాంతంలో సుదీర్ఘ కరువు తర్వాత పంటల సాగు చేయడం రైతులకు కలిసి వచ్చింది. గత మార్చి, ఏప్రిల్, మే నెలల్లో వివిధ జిల్లాల్లో టీవీ చానెల్ ప్రతినిధుల పర్యటనలు కాన రాలేదు.
కరువు పరిస్థితులు లేకపోవడంతో ఉపశమనం లభించినట్లేనని ప్రభుత్వం భావించింది. కానీ రైతుల ఆత్మహత్యలు పెరిగిపోవడంతో వ్యవసాయ రంగంలో నెలకొన్న సంక్షోభం ప్రభుత్వాన్ని చౌరస్తాలోకి తీసుకొచ్చింది. పంట రుణాలు చెల్లించలేక రైతుల ఆత్మహత్యలు పెరుగుతూ వచ్చాయి. ప్రత్యేకించి ఈ నెలలో పశ్చిమ, ఉత్తర మహారాష్ట్ర ప్రాంతాల రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన బాట పట్టారు.
యూపీలో హామీతో పెరిగిన రాష్ట్రాల డిమాండ్లు
సంపూర్ణ పంట రుణ మాఫీ అమలు చేయాలని డిమాండ్ ముందుకు తెచ్చారు. దీనికి తోడు మార్చిలో జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందడం కోసం యూపీలో ఎన్నికల మ్యానిఫెస్టోలో పంట రుణాల మాఫీ పథకం అమలు చేస్తామని ఇచ్చిన హామీ మేరకు చారిత్రక విజయం సాధించింది బీజేపీ. అధికారంలోకి వచ్చాక రుణ మాఫీ అమలు చేస్తామని ప్రకటించడంతో అన్ని రాష్ట్రాలు అదే డిమాండ్ ముందుకు తెచ్చాయి. ఆ బాటలో మహారాష్ట్ర ప్రజలు ముందు వరుసలో నిలిచారు. ఇక రోజుకొకరు బలవన్మరణానికి గురయ్యారు.
ముంబైకి ఇలా పాలు, కూరగాయలు బంద్
ఈ నెల ఒకటో తేదీ నుంచి నలుగురు రైతులు ఆత్మహత్యలకు పాల్పడంతో ఆందోళన తీవ్రతరమైంది. ఈ నెల ఒకటో తేదీన అహ్మద్నగర్ జిల్లాలోని ఒక గ్రామంలో మొదలైన రైతుల ఆందోళన క్రమంగా రాష్ట్రమంతా విస్తరించింది. అందులో భాగంగా వివిధ ప్రాంతాల నుంచి ముంబైకి కూరగాయలు, పాల పంపిణీ నిలిపేయాలని రైతులు నిర్ణయించారు.
పంట రుణ మాఫీ భారం జీఎస్డీపీలో 18 శాతం
ఆందోళన తీవ్రతరం కావడంతోపాటు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఆందోళన చేస్తున్న రైతులపై కాల్పులతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ముందుచూపుతో వ్యవహరించారు. రైతుల పంట రుణాలను మాఫీ చేస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రైతులకు ఉపశమనం కల్పించేందుకు పంట రుణాల మాఫీ పథకం అమలుపై విధి విధానాల రూపకల్పనకు కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నది. రుణమాఫీతో రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి (జీఎస్టీడీపీ)లో 18 శాతం ఉంటుందని ఇండియా రేటింగ్స్ సంస్థ అంచనా. దీంతో సోమవారం నుంచి మరింత ఉధృతంగా ఆందోళన చేయాలన్న తమ ఆలోచనను విరమించుకుంటున్నామని రైతు సంఘాలు ప్రకటించాయి.
విధి విధానాలకు ఇలా కమిటీ నియామకం
మహారాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి చంద్రకాంత్ పాటిల్ మీడియాతో మాట్లాడుతూ ‘పంట రుణాలను మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. చిన్న, సన్నకారు రైతుల రుణాలన్నీ మాఫీ అవుతాయి అని చెప్పారు. రుణ మాఫీ పథకం అమలుకు అవసరమైన విధి విధానాల రూపకల్పనకు చంద్రకాంత్ పాటిల్ సారథ్యంలో ఉన్నతస్థాయి కమిటీని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఏర్పాటు చేశారు.
ఇలా ఆందోళన విరమణ
తమ డిమాండ్లు నెరవేరినందుకు రైతులు హర్షం వ్యక్తంచేశారు. ‘మా డిమాండ్లన్నీ పరిష్కారం అయ్యాయి. మేం తాత్కాలికంగా ఆందోళనను విరమించాలని నిర్ణయించాం. సోమవారం నుంచి తలపెట్టిన నిరసనలను నిలిపివేస్తున్నాం. వచ్చేనెల 25 లోగా ప్రభుత్వం సంతృప్తికరమైన నిర్ణయం తీసుకోకుంటే మళ్లీ ఆందోళన ప్రారంభిస్తాం' అని లోక్సభ సభ్యుడు, రైతు నాయకుడు రాజుశెట్టి తెలిపారు. మంత్రి చంద్రకాంత్ పాటిల్ హామీతో ప్రస్తుతం దీపావళి సంబురాలు జరుపుకున్నంత ఆనందంగా ఉన్నదని మరో రైతు నాయకుడు రఘనాథదాదా పాటిల్ తెలిపారు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు (ఆదివారం) తీసుకున్న నిర్ణయం వచ్చేనెల 24లోగా అమలు కాకపోతే రైతులు మళ్లీ ఆందోళన బాట పడతారని స్వతంత్ర ఎమ్మెల్యే బచ్చు కడు తెలిపారు.
మహారాష్ట్రలో ఇలా పెరుగనున్న ద్రవ్యలోటు
మహారాష్ట్రలో 1.07 కోట్ల మంది చిన్న, సన్నకారు రైతుల పంట రుణాలను మాఫీ చేయాలని నిర్ణయం తీసుకున్న ఫలితంగా ప్రభుత్వ ఖజానాపై వాస్తవంగా రూ.30 వేల కోట్ల భారం పడనున్నది. ఇది రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (జీఎస్టీడీపీ)లో 18 శాతం అని ఇండియా రేటింగ్స్ ఒక నివేదికలో పేర్కొన్నది. పంట రుణాల మాఫీ పథకం అమలు కారణంగా రాష్ట్ర బడ్జెట్లో 1.53 శాతంగా ఉన్న ద్రవ్యలోటును 2.71 శాతానికి పెరుగుతుందని పేర్కొన్నది. అయితే ఈ పథకం అమలుకు ఐదెకరాల లోపు సాగు భూమి గల రైతులు మాత్రమే అర్హులు. రుణ మాఫీ పథకం అమలుతో తలెత్తే అదనపు భారాన్ని తగ్గించుకునేందుకు పన్నేతర ఆదాయ మార్గాల ద్వారా రూ.10 వేల కోట్లు సేకరిస్తామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి సుధీర్ ముంగంటివార్ తెలిపారు. రాష్ట్రంలో 2.5 కోట్ల మంది వ్యవసాయం చేస్తున్నారన్నారు. అయితే ఇప్పటికే రూ. 6 లక్షల కోట్ల నిరర్ధక ఆస్తులు (మొండి బకాయిలు) ఎన్పీఏలతో సతమతం అవుతున్న బ్యాంకింగ్ వ్యవస్థకు మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మరింత భారం కానున్నది.