Coronavirus: ఉద్దవ్ థాకరేను ఎమ్మెల్సీ చేయండి, గవర్నర్ కొషియారికి మహారాష్ట్ర ప్రభుత్వం తీర్మానం
కరోనా వైరస్ వల్ల మహారాష్ట్ర ఎమ్మెల్సీ ఎన్నికలు ఆగిపోయాయి. సీఎం ఉద్దవ్ థాకరేను ఎమ్మెల్సీగా నియమించాలని గవర్నర్ భగత్ సింగ్ కొషియారికి రాష్ర్ట ప్రభుత్వం తీర్మానం పంపించింది. మహారాష్ట్ర నుంచి ప్రత్యక్ష్యంగా కానీ, పరోక్షంగా కానీ ఉద్దవ్ థాకరే ఎన్నిక కానీ సంగతి తెలిసిందే.
సీఎం పదవీ చేపట్టిన వ్యక్తి ఆరునెలల లోపు ఎమ్మెల్యే లేదంటే ఎమ్మెల్సీగా ఎన్నిక కావాలి. నవంబర్లో మహారాష్ట్ర సీఎంగా ఉద్దవ్ పదవీ బాధ్యతలు చేపట్టారు. మే నెలలో అతను చట్టసభకు ఎన్నిక కావాలి. లేదంటే తన పదవీకి రాజీనామా చేయాల్సి ఉంటుంది. గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ నేతృత్వం వహించారు. సమావేశంలో నిర్ణయం తీసుకొని తీర్మానం చేశారు. ఆ ప్రతిని గవర్నర్కు పంపించారు. దీనిపై కొషియారి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వం కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. బీజేపీతో పొత్తు తేలకపోవడంతో కాంగ్రెస్, ఎన్సీపీతో కలిసి శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మహారాష్ట్రలో కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగానే ఉంది. 1135 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 72 మంది చనిపోయారు. దీంతో వచ్చేనెలలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలను వాయిదా వేశారు. అందుకోసమే మంత్రివర్గం తీర్మానం చేసి గవర్నర్కు పంపించింది.