అమిత్ షాకు స్పాట్ పెట్టిన శరద్ పవార్? జస్టిస్ లోయా మృతి కేసును మళ్లీ తెరుస్తామన్న మహారాష్ట్ర సర్కార్
2014 నాటి సీబీఐ స్పెషల్ జడ్జి జస్టిస్ బీహెచ్ లోయా అనుమానాస్పద మృతి కేసును రీఓపెన్ చేస్తామంటూ మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్ముఖ్ సంచలన ప్రకటన చేశారు. ప్రస్తుత కేంద్ర హోం మంత్రి, బీజేపీ చీఫ్ అమిత్ షా.. గుజరాత్ హోం మంత్రిగా పనిచేసిన కాలంలో చోటుచేసుకున్న సోహ్రాబుద్దీన్ నకిలీ ఎన్కౌంటర్ కేసును విచారిస్తూ జస్టిస్ లోయా అనుమానాస్పదరీతిలో మరణించారు. ఆ రెండు కేసుల్లో అమిత్ షా ప్రమేయం ఉండొచ్చని అప్పట్లో ఆరోపణలొచ్చాయి.
సుప్రీం కొట్టేసిన కేసు..
సోహ్రబుద్దీన్ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న అమిత్ షానే జస్టిస్ లోయాను కూడా అడ్డు తప్పించి ఉంటారని అప్పట్లో ‘కారవాన్' అనే పత్రిక సంచలన కథనాలు రాసింది. లోయా చనిపోయిన కొద్దిరోజులకే సోహ్రబుద్దీన్ కేసు నుంచి అమిత్ షాకు విముక్తి లభించడాన్ని ఆ పత్రిక హైలైట్ చేసింది. అయితే సుప్రీంకోర్టు మాత్రం ఈ ఆరోపణల్ని తోసిపుచ్చింది. లోయా మృతిపై దాఖలైన అన్ని పిటిషన్లను గతంలోనే కొట్టిపారేసింది. ఇప్పుడదే కేసును మళ్లీ తెరుస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం సంచలనంగా మారింది.
పవార్ డైరెక్షన్ లోనే..
మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీల ‘వికాస్ ఆగాధి' కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. జస్టిస్ లోయా మృతి కేసును రీఓపెన్ చేస్తామంటూ మహారాష్ట్ర హోం మంత్రి ప్రకటన చేయడానికి ముందు ముంబైలో హైడ్రామా జరిగింది. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ తన పార్టీకి చెందిన మంత్రులను పిలిపించుకుని దాదాపు రెండు గంటలపాటు మంతనాలు జరిపారు. మీటింగ్ ముగిసిన కొద్దిసేపటికే మంత్రి అనిల్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘సరైన ఆధారాలతో ఎవరైనా ముందుకొస్తే గనుక జస్టిస్ లోయా మృతి కేసును మళ్లీ తెరవాలని మా ప్రభుత్వం నిర్ణయించింది. ఆమేరకు ఇవాళ కొంత మంది నన్ను కలిసి రిక్వెస్ట్ చేశారు. అవసరమనుకుంటే కచ్చితంగా కేసును మళ్లీ తిరగదోడతాం''అని స్పస్టం చేశారు.
అంత సీన్ లేదు.. అమిత్ షాకు ఏమీ కాదు..
మహారాష్ట్ర ప్రభుత్వ ప్రకటనపై న్యాయ నిపుణులు భిన్నంగా స్పందించారు. సోహ్రాబుద్దీన్ ఎన్కౌంటర్, లోయా మృతి కేసులు ముగిసిన అధ్యాయాలని, ఈ రెండు కేసుల్లో అమిత్ షాకు వ్యతిరేకంగా కనీసం ఒక్క ఆధారం కూడా లభించలేదని, ఆయనపై వచ్చిన ఆరోపణలన్నీ రాజకీయ ప్రేరితాలేనని సుప్రీంకోర్టు కూడా అభిప్రాయపడ్డ విషయాన్ని న్యాయ నిపుణులు గుర్తుచేశారు. పవార్ ప్రయత్నం కూడా రాజకీయ ప్రేరితమని ముందే అర్థమవుతోందని, ఒక వేళ కేసు రీఓపెన్ అయినా ఎవరూ ఎఫెక్టయ్యే అవకాశమేలేదని అభిప్రాయపడ్డారు.
అసలేం జరిగిందంటే..
మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ సోహ్రబుద్దీన్, అతడి భార్య కౌసర్బీ, అనుచరుడు తులసీ ప్రజాపతిలను గుజరాత్ పోలీసులు నకిలీ ఎన్ కౌంటర్ లో చంపేశారని, అప్పటి గుజరాత్ హోం మంత్రి అమిత్ షా ఆదేశాలతోనే ఇది జరిగిందని సీబీఐ ఆరోపించింది. అప్పట్లో సంచలనం రేపిన ఈ కేసును ముంబైలోని సీబీఐ స్పెషల్ కోర్టు జడ్జి బీహెచ్ లోయా విచారించారు. 2014 డిసెంబర్ 1న ఓ పెండ్లి వేడుకలో పాల్గొనేందుకు నాగ్పూర్ వెళ్లిన ఆయన.. గుండెపోటుతో చనిపోయారు. అయితే అది సహజమరణం కాదని, కుట్రపూరితంగా హత్యచేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ ఆ ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవు. జస్టిస్ లోయా చనిపోయిన తర్వాత సోహ్రబుద్దీన్ ఎన్ కౌంటర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న 38మందిలో అమిత్ షాతోపాటు 16 మందికి విముక్తి లభించింది.
ఎన్నికల ప్రచారంలోనూ..
చనిపోయిన సీబీఐ జడ్జి బీహెచ్ లోయా మహారాష్ట్ర(లాతూర్)కే చెందినవారు కావడంతో ఈ కేసుపై ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ మొదటి నుంచీ ఆసక్తి ప్రదర్శించారు. గతేడాది అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోననూ పవార్.. లోయా కేసును ప్రస్తావించారు. శివసేన కూడా లోయా మరణంపై గతంలో పలు అనుమానాలు వ్యక్తం చేసింది. మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘జస్టిస్ లోయా కేసును రీఓపెన్ చేసే విషయంలో పవార్ చాలా క్లారిటీతో ఉన్నారు. ఆమేరకే హోంమంత్రి (అనిల్ దేశ్ముఖ్) ప్రకటన చేశారు''అని వెల్లడించారు. ఈ వార్తకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సిఉంది.