ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి ఎంవీఏ షాక్: కాషాయం ఖాతాలో ఒక్కటే, శివసేన కూటమికి 4
ముంబై: మహారాష్ట్రలో ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి భారీ షాక్ తగిలింది. డిసెంబర్ 1న మొత్తం మూడు గ్రాడ్యుయేట్, రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగ్గా.. బీజేపీ కేవలం ఒక చోట మాత్రమే విజయం సాధించింది. మిగిలిన నాలుగు స్థానాల్లో అధికార శివసేన నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ కూటమి గెలుపొందింది.
ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై మాజీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. మహా వికాస్ అఘాడీ కూటమి బలాన్ని తక్కువ అంచనా వేశామని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు తమ అంచనాల ప్రకారం రాలేదన్నారు. తాము మరికొన్ని సీట్లు ఆశించామని తెలిపారు. ఇక ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మాట్లాడుతూ.. తాజా ఎమ్మెల్సీ ఫలితాలు మహా వికాస్ అఘాడీ కూటమి ప్రభుత్వ ఏడాది పాలనకు నిదర్శనమని అన్నారు.
ఔరంగాబాద్ గ్రాడ్యుయేట్ డివిజన్లో ఎన్సీపీకి చెందిన సతీష్ చవాన్ గెలుపొందారు. పుణె గ్రాడ్యుయేట్ డివిజన్లో కూడా ఎన్సీపీ నేత అరుణ్ లాడ్ విజయం సాధించారు. పుణెలో ఓటమి బీజేపీకి పెద్ద ఎదురుదెబ్బేనని చెప్పాలి. 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ స్థానానికి బీజేపీ మహారాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ ప్రాతినిథ్యం వహించడం గమనార్హం. ఈ స్థానాన్ని తిరిగి దక్కించుకోవాలని మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, పాటిల్ చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు.
నాగ్పూర్ గ్రాడ్యుయేట్ డివిజన్లో కాంగ్రెస్ నేత అభిజిత్ వంజరీ, పుణె టీచర్స్ సెగ్మెంట్లో కాంగ్రెస్ నాయకుడు జయంత్ అస్గోవంకర్ ఆధిక్యతను చాటుకున్నారు. అమరావతి టీచర్స్ డివిజన్లో స్వతంత్ర అభ్యర్థి కిరణ్ సర్నాయక్ ముందుంజలో ఉన్నారు. పూర్తి ఫలితాలు వెలువడేసరికి వీరి విజయం దాదాపు ఖాయమైంది.