ఇదెలాగా: రాష్ట్రపతి పాలనపైనే బీజేపీ ఆశలు... ఇంకా రేసులోనే ఉన్నామంటూ హింట్
ముంబై: మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటులో శివసేనకు ఎన్సీపీ కాంగ్రెస్ మద్దతు లభించకపోవడంతో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు రేసు నుంచి ఇంకా తప్పుకోలేదు. ప్రభుత్వం ఏర్పాటు చేస్తామనే ధీమాతోనే కమలనాథులు ఉన్నారు. ఇందులో భాగంగానే మహారాష్ట్రలో జరుగతున్న పొలిటికల్ అపడేట్స్ పై ఎప్పటికప్పుడు నివేదిక తెప్పించకుంటోంది బీజేపీ హైకమాండ్.
మహారాష్ట్ర కొత్త సీఎంగా శివసేన అభ్యర్థి..శరద్ పవార్ రేసులో లేరు: సంజయ్ రౌత్
ప్రభుత్వ ఏర్పాటులో ఇంకా రేసులోనే ఉన్నాం: బీజేపీ
మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం లేదని గవర్నర్కు తెలిపింది. దీంతో గవర్నర్ శివసేనకు అవకాశం ఇవ్వగా ఆ పార్టీ కూడా విఫలమైంది. ఇక ఎన్సీపీకి అవకాశం ఇవ్వగా అది నేటితో తేలుతుంది. ఈక్వేషన్స్ చూస్తే మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన తప్పదనే సంకేతాలు వస్తున్నాయి. దీన్నే తిరిగి క్యాష్ చేసుకోవాలని భావిస్తోంది బీజేపీ. ప్రభుత్వ ఏర్పాటు రేసులో తాము ఇంకా ఉన్నామనే సంకేతాలు పంపుతోంది. మహారాష్ట్రలో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిస్థితులను సమీక్షిస్తున్నామని బీజేపీ నేత సుధీర్ ముంగన్తివార్ చెప్పారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. అంతవరకు తాము వెయిట్ అండ్ వాచ్ పద్ధతిని అవలంబిస్తామని చెప్పారు.
రాష్ట్రపతి పాలనపైనే కమలనాథుల ఆశ
రాష్ట్రపతి పాలన పైనే కమలనాథులు ఆశలు పెట్టుకున్నారు. అంతేకాదు శివసేనకు ప్రభుత్వ ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ మద్దతు ఇవ్వదని తమకు ముందే తెలుసని కమలనాథులు చెప్పారు. ఇక ఈ పరిస్థితే తలెత్తితే ఎన్సీపీ మద్దతు మరికొందరు శివసేన, కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామనే ఆలోచలో కమలనాథులు ఉన్నట్లు సమాచారం. ఒకవేళ ఎన్సీపీ-కాంగ్రెస్-శివసేనలు కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేసినా... ఆ ప్రభుత్వం ఏడాదికంటే ఎక్కువగా అధికారంలో ఉండలేదని కమలనాథులు జోస్యం చెబుతున్నారు.
ఇక శివసేనతో మాటలుండవు
గత 30ఏళ్లుగా మిత్రపక్షంగా కొనసాగుతున్న శివసేనతో ఇకపై మాటలుండవని బీజేపీ చెబుతోంది. అదే సమయంలో శివసేన వ్యవహారంతో విసుగెత్తిపోయిన 25 మంది ఆ పార్టీ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారనే సంచలన వ్యాఖ్యలు చేసింది బీజేపీ. అయితే ఈ మొత్తం సస్పెన్స్ థ్రిల్లర్కు మంగళవారం సాయంత్రం తెరపడుతుందని వెల్లడించింది.