మహా పాలిటిక్స్: గవర్నర్ వద్దకు ప్రోటెం స్పీకర్ గా ఆరుగురి పేర్లు..ఎవరెవరంటే
మహారాష్ట్ర అసెంబ్లీలో దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం 24 గంటల్లోగా బలనిరూపణ చేసుకోవాలని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో మహారాష్ట్ర రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. మహారాష్ట్ర అంశంలో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు విషయంలో పారదర్శకంగా అసెంబ్లీలో సీఎం బలం నిరూపించుకోవాలని ఆదేశించింది. వెంటనే ప్రొటెం స్పీకర్ నియమించి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించాలని, సాయంత్రం ఐదు గంటల లోగా బల నిరూపణ జరగాలని, బలనిరూపణకు ప్రత్యక్ష ప్రసారం చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇప్పుడు ప్రొటెం స్పీకర్ ఎవరన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
రెండోసారి మహరాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ తొలి సంతకం ఆ చెక్కుపైనే
సాధారణంగా బల పరీక్షకు ముందు సీనియర్ ఎమ్మెల్యేను ప్రొటెం స్పీకర్ గా ఎన్నుకుంటారు. ఆయన సభలోని మొత్తం ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఆ తరువాత స్పీకర్ ఎన్నిక.. ఆ వెంటనే బల పరీక్ష జరుగుతాయి. కానీ, ఇక్కడ సుప్రీం కోర్టు వెంటనే సీనియర్ ఎమ్మెల్యేను ప్రొటెం స్పీకర్ గా ఎన్నుకోవాలని ఆదేశించింది. ఆయన పర్యవేక్షణలోనే ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం, బలపరీక్ష నిర్వహించాలని ఆదేశించింది.ఇక ఈనేపధ్యంలో ప్రొటెం స్పీకర్ పై అన్ని పార్టీల దృష్టి మళ్ళింది.
ప్రస్తుత మహారాష్ట్ర అసెంబ్లీలో, అహ్మద్ నగర్ జిల్లాలోని సంగమ్నేర్ కు చెందిన ఎమ్మెల్యే రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు బాలా సాహెబ్ తోరత్ ఎనిమిది పర్యాయాలుగా విజయం సాదించిన సీనియర్ మోస్ట్ నాయకుడిగా ఉన్నారు. ఇక అలాగే రెబెల్ ఎన్సీపీ ఎమ్మెల్యే అజిత్ పవార్ ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నాడు. కానీ ఆయన పేరు పరిశీలనకు పంపే అవకాశం లేదు . ఇక ఇతర ఏడుగురు ఎమ్మెల్యేలు చూసినట్లయితే జయంత్ పాటిల్, దిలీప్ వాల్సే పాటిల్ , బాబన్ రావ్ పచ్ పుట్ , కాళిదాసు కోలాంబ్కర్, మరియు కేసీ పద్వీ తదితరులు సీనియర్ మోస్ట్ నాయకులుగా ఉన్నారు. ఇక వాల్సే పాటిల్ మరియు బాగడే 12 మరియు 13వ అసెంబ్లీల మాజీ స్పీకర్లు .
అయితే ప్రొటెం స్పీకర్ గా గవర్నర్ కు సిఫార్సు చేసిన ఆరుగురి పేర్లను గమనించినట్లైతే భారతీయ జనతా పార్టీకి చెందిన రాధాకృష్ణ విఖే పాటిల్, కాళిదాస్ కోలాంబ్కర్, బాబన్ రావు భికాజీ పచ్ పూత్,లను సిఫార్సు చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ నుండి బాలా సాహెబ్ తోరత్, కేసీ పద్వీ లను సిఫార్సు చేస్తున్నారు. ఎన్సీపీ నుండి దిలీప్ వాల్సే పాటిల్ పేరు పరిశీలనకు పంపారు. అయితే వీరందరిలో పచ్ పుత్ మరియు బాగడే పై బీజేపీ ఆసక్తి చూపిస్తుంది అని తెలుస్తుంది . మరి ప్రోటెం స్పీకర్ గా గవర్నర్ ఎవరి పేరు ఫైనల్ చేస్తారో వేచి చూడాలి .