కాంగ్రెస్, ఆర్ఎస్ఎస్ మధ్య మహాభారత యుద్ధం: చిద్దూ
కాంగ్రెస్ పార్టీకి, రాజకీయేతర సంస్థగా ఎప్పుడూ చెప్పుకుంటూ తన అనుబంధ రాజకీయ పార్టీని తెరవెనుక నుంచి నియంత్రిస్తున్న సంస్థకు మధ్య మహాభారత యుద్ధం జరగబోతోందన్నారు. ఆయన పరోక్షంగా ఆర్ఎస్ఎస్ను ప్రస్తావించారు. భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థిగా గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని ముందుకు తెచ్చిన ఆర్ఎస్ఎస్పై ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
ఆర్ఎస్ఎస్ తన దుష్ట, విచ్ఛిన్నకర విత్తనాలను ప్రజల్లో నాటడం ద్వారా వారిని మతపరంగా విభజించేందుకు ప్రయత్నిస్తోందని చిదంబరం ఆరోపించారు. తాను హోంమంత్రిగా ఉన్న సమయంలో ఎన్కౌంటర్లకు ఒప్పుకోలేదని ఆయన పేర్కొన్నారు. ఉగ్రవాదులు, నేరస్థులను సజీవంగా పట్టుకోవాలని, వాళ్లు కాల్పులు జరిపితేనే ఎదురుకాల్పులు జరపాలని తాను భద్రతా బలగాలను ఆదేశించానని ఆయన వెల్లడించారు.
నిత్యం వాజపేయి జపం చేస్తున్న మోడీని పలుమార్లు ప్రధాని హోదాలో వాజపేయి తీవ్రంగా విమర్శఇంచిన విషయాన్ని మర్చిపోయారన్నారు. సమాచార హక్కు చట్టం, విద్యాహక్కు చట్టం, ఉపాధి హామీ పథకం, ఆహార భద్రత చట్టం వంటి ఎన్నో విప్లవాత్మక చట్టాలు, కార్యక్రమాలను కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకొచ్చిందని చిదంబరం పేర్కొన్నారు.