భారతాన్ని మించిందిలేదు: అద్వానీ, బీఎంఏసీ చీఫ్ విద్వేష వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: జ్ఞానాన్ని అందించే మహాభారతం, రామాయణం ఎంతో ఉత్కృష్టమైన గ్రంథాలని బీజేప అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ ఆదివారం అన్నారు. ప్రపంచంలోనే ఎంతో మహోన్నతమైన ఈ గ్రంథాలను ప్రతి ఒక్కరూ చదవాలన్నారు. మహాభారతాన్ని జాతీయ గ్రంథంగా ప్రకటించాలన్న వాదనను కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ తెర మీదికి తీసుకువచ్చిన నేపథ్యంలో అద్వానీ ఈ సూచన చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
మహాభారతాన్ని ఒకేసారి పూర్తిగా కాకుండా భాగాలుగా చదవాలని తన చిన్ననాటి కాలంలో నానమ్మ చెప్పేదని, ఈ గ్రంథాన్ని ఇంట్లో ఉంచుకోవడం అనర్థదాయకమన్న మూఢనమ్మకం అప్పట్లో బలంగా కొనసాగడమే ఇందుకు కారణమని అద్వానీ తెలిపారు.
రాజకీయాలు, నైతిక విలువలకు సంబంధించిన జ్ఞానాన్ని అందించడంలోనే కాకుండా, ధైర్యాన్ని, ఐకమత్యాన్ని పెంపొందించడంలో మహాభారతాన్ని మించిన గ్రంథం ప్రపంచంలో మరేదీ లేదన్నారు. ప్రఖ్యాత పాత్రికేయుడు, ఉర్దూ వార్తాపత్రిక డైలీ ప్రతాప్ అధినేత కె నరేంద్ర 100వ జయంతి సందర్భంగా ఆదివారం న్యూఢిల్లీలో నిర్వహించిన స్మారక కార్యక్రమంలో అద్వానీ ఈ విషయాన్ని స్పష్టం చేశారు.
చిన్నతనంలో తన విద్యాభ్యాసం క్రైస్తవ మిషనరీ పాఠశాలలో సాగినందున అప్పట్లో తనకు మాతృభాష (సింధీ)తో పాటు ఆంగ్ల భాష పట్ల మాత్రమే అవగాహన ఉండేదని, దీంతో ఆ భాషల్లోనే రామయణ, మహాభారతాలను చదివానని, అయితే దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత ఈ గ్రంథాలను హిందీలో చదివానని వివరించారు.
బీఎంఏసీ అధ్యక్షుడు వివాదాస్పద వ్యాఖ్యలు
మత మార్పిడులను కొనసాగిస్తే, ఆగ్రా వంటి ఘటనలు పునరావృతం అయితే తీవ్ర పరిణామాలు తప్పవని, దేశంపై యుద్ధం ప్రకటిస్తామని ముస్లిములమంతా సైనికుల తరహాలో ఏకమవుతామని, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంటుపై దాడి చేస్తామని, ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రిని ముక్కలు ముక్కలు చేసేస్తామని బాబ్రీ మసీదు యాక్షన్ కమిటీ అధ్యక్షుడు సలీమ్ అహ్మద్ విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారు.
ఆయుధాలు పట్టుకునే పరిస్థితిని తమకు కల్పించవద్దని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీలను ఉద్దేశించి హెచ్చరించారు. ఈ మేరకు ఒక వీడియో శనివారం మొరాదాబాద్ జిల్లాలో బయటకు వచ్చింది. బాబ్రీ మసీదు యాక్షన్ కమిటీ (బీఎంఏసీ) ఆధ్వర్యంలో ముస్లిం మత పెద్దలు శుక్రవారం మొరాదాబాద్లో సమావేశమయ్యారు.
ఆగ్రాలోని రెండు హిందూ సంస్థలు 60 ముస్లిం కుటుంబాలను మతం మార్పించిన ఆరోపణలపై చర్చించారు. ఈ సందర్భంగా సలీమ్ అహ్మద్ మాట్లాడుతూ.. మనం (ముస్లింలు) ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని, మన స్వీయ భద్రత కోసం మనం ఆయుధాలు పట్టడానికి కూడా వెనకాడవద్దని, మనమంతా ఏకమయ్యే పరిస్థితులు కల్పిస్తున్నారని, ఎంపీలు, ఎమ్మెల్యేలకు తగిన గుణపాఠం చెప్పడానికి మనమంతా కలిసి యూపీ అసెంబ్లీ, పార్లమెంటులపై దాడి చేద్దామని, ఇందుకు ఒక సైన్యంగా ఏర్పడదామని వ్యాఖ్యానించారు.
ఇందుకు కావాల్సిన అన్ని రకాల ఆయుధాలు, మందుగుండు సామగ్రిని తాము సరఫరా చేస్తామన్నారు. భారత దేశ ముఖచిత్రాన్ని మార్చే దమ్ము తమకు ఉందని వ్యాఖ్యానించారు. ఆయుధాలు పట్టుకునే పరిస్థితిని మాకు కల్పించవద్దని, ప్రధాన మంత్రికి, ముఖ్యమంత్రికి అది ఏమాత్రం మంచిది కాదని, ఆ తర్వాత ఏ ఒక్కరూ ఏకఖండంగా మిగలరని హెచ్చరించారు. దేశ భవిష్యత్తుకు మత మార్పిడులు మంచివి కాదని, వెంటనే వాటిని నిలిపి వేయాలని స్పష్టం చేశారు.