ఇండియా టీవీ సీఎన్ఎక్స్ సర్వే: ఉత్తర్ ప్రదేశ్లో బీజేపీకి ఎదురుదెబ్బ.. కూటమిదే హవా
2019 లోక్సభ ఎన్నికల హీట్ స్టార్ట్ అయ్యింది. ఎక్కడ చూసినా, ఎక్కడా విన్నా ప్రజలు 2019 సాధారణ ఎన్నికల గురించే మాట్లాడుకుంటున్నారు... చర్చించుకుంటున్నారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని కొందరు భావిస్తుంటే... మరి కొందరు కాంగ్రెస్ అధికార పగ్గాలు చేపడుతుందని వాదిస్తున్నారు. ప్రజల పరిస్థితి ఇలా ఉంటే... సర్వేల పరిస్థితి మరోలా ఉంది. రోజుకో సర్వే.. పూటకో సర్వే తమ ఫలితాలను వదులుతూ తమ విశ్లేషణలను అందిస్తున్నాయి.
సర్వేలు ఏమి ఘోషిస్తున్నాయి..?
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఇప్పటికే దేశవ్యాప్తంగా హీట్ను క్రియేట్ చేశాయి. 2019 సాధారణ ఎన్నికలకు ఇవి సెమీ ఫైనల్స్గా భావిస్తున్నారు. ఇప్పటికే ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలపై సర్వేలు వచ్చి తమ విశ్లేషణ ఇవ్వగా...ఇప్పుడు లోక్సభ ఎన్నికలపై దృష్టి సారించాయి సర్వే సంస్థలు. ఇప్పటికిప్పుడు లోక్సభ ఎన్నికలు జరిగితే ప్రజలు ఎవరివైపు ఉన్నారో ఈ సర్వేలు జోస్యం చెబుతున్నాయి. ఉత్తర్ప్రదేశ్లో మోడీ మ్యాజిక్ మరో సారి వర్కవుట్ అవుతుందా..? పశ్చిమ బెంగాల్లో దీదీ మమతా బెనర్జీ మరోసారి తన బలాన్ని నిరూపించుకుంటుందా..? ఒడిషాలో నవీన్ పట్నాయక్ మళ్లీ అద్భుతాన్ని సృష్టిస్తారా అనే దానిపై ఢిల్లీలోని ప్రముఖ సర్వే సంస్థ సీఎన్ఎక్స్ ఓ జాతీయ ఛానెల్ ఇండియా టీవీకి సర్వే చేసి ఫలితాలను విడుదల చేసింది.
ఉత్తర్ ప్రదేశ్లో బీజేపీకి మహా కూటమి అడ్డుకట్ట వేస్తుందా..?
2019 లోక్సభ ఎన్నికలపై ఇండియా టీవీ-సీఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్ తమ సర్వే ఫలితాలను వెల్లడించాయి. ఉత్తర్ప్రదేశ్లో మహాగట్భంధన్ కూటమి వాస్తవ రూపం దాలిస్తే ప్రస్తుతం ఆ రాష్ట్రంలో ఉన్న బీజేపీ పార్లమెంటు స్థానాలు సగానికి పడిపోతాయని స్పష్టం చేసింది. సమాజ్ వాదీ పార్టీ, బీఎస్పీ, కాంగ్రెస్లు కూటమిగా పోటీచేస్తే ఎన్డీఏకు 31 సీట్లు వస్తాయని చెప్పిన ఒపీనియిన్ పోల్... మహాకూటమికి 49 స్థానాల్లో విజయం సాధిస్తుందని జోస్యం చెప్పింది. ఇక పార్టీల వారీగా చూస్తే బీఎస్పీకి 18 స్థానాలు, సమాజ్ వాదీ పార్టీకి 21 స్థానాలు, కాంగ్రెస్కు 8 స్థానాలు, ఆర్ఎల్డీకి 2 స్థానాలు వస్తాయని పేర్కొంది. ఇక ఎన్డీఏ చూస్తే బీజేపీకి 30 స్థానాలు అప్నాదల్కు 1 స్థానం వస్తుందని స్పష్టం చేసింది. ఒకవేళ కూటమి లేకుండా విడివిడిగా పార్టీలు బరిలోకి దిగితే బీజేపీకి 55 స్థానాలు, బీఎస్పీకి 9 స్థానాలు, ఎస్పీకి 9 స్థానాలు, కాంగ్రెస్కు 5,ఆర్ఎల్డీ అప్నాదల్ పార్టీలు చెరో స్థానంలో విజయం సాధిస్తాయని సర్వే పేర్కొంది. ఓటు షేరు చూస్తే బీజేపీకి 39.19 శాతం, బీఎస్పీకి 20 శాతం, ఎస్పీకి 20.55 శాతం, కాంగ్రెస్కు 11.91 శాతం వస్తాయని వెల్లడించింది.
పశ్చిమ బెంగాల్లో మమతా ముందు పనిచేయని మోడీ మ్యాజిక్
ఉత్తర్ ప్రదేశ్లో పరిస్థితి ఇలా ఉంటే బెంగాల్లో పరిస్థితి మరోలా ఉంది. ఇక మోడీని వ్యతిరేకించే వారిలో ఎవరైన ముందు వరసలో ఉన్నారా అంటే అది కచ్చితంగా బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీనే అని చెప్పక తప్పదు. ఇప్పటికే పశ్చిమ బెంగాల్లో బీజేపీ బేస్ను కట్టుకునేందుకు చాలా కష్టపడుతోంది. అయితే మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ మాత్రం ఇక్కడా ఇంకా బలంగానే కనిపిస్తోందంటూ సర్వే పేర్కొంది. 2019 లోక్సభ ఎన్నికల్లో మమతా బెనర్జీ పార్టీ టీఎంసీ మరోసారి తన సత్తా చాటుతుందని సర్వే ఘోషిస్తోంది. 42 లోక్సభ స్థానాలున్న బెంగాల్లో 27 స్థానాలు మమతా పార్టీ అవలీలగా గెలుచుకుంటుందని సర్వే వెల్లడించింది. కమలం పార్టీ 8 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వస్తుందని తెలిపింది. మరోవైపు కొన్ని దశాబ్దాలుగా కమ్యూనిస్టులకు కంచుకోటగా ఉన్న పశ్చిమ బెంగాల్లో ఈ సారి ఆ పార్టీ కేవలం ఐదు సీట్లు మాత్రమే గెలుచుకుంటుందని సీఎన్ఎక్స్ సర్వే పేర్కొంది. ఇక ఓటు షేరును చూస్తే 2014 లోక్సభ ఎన్నికల్లో టీఎంసీ ఓటు షేరు 39.79 శాతం ఉండగా ప్రస్తుతం అది 36.2 శాతానికి పడిపోతుందని చెప్పింది. ఇదిలా బీజేపీ ఓటు షేరు 17.01శాతం నుంచి 27.77శాతానికి పెరగనుంది.
ఒడిషాలో మళ్లీ నవీన్ పట్నాయక్ మంత్రం
ఇక ఒడిషా రాష్ట్రంలో చూస్తే... ఆ రాష్ట్రంలో మొత్తం 21 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఇందులో అధికార బిజు జనతాదల్ పార్టీకి 16 సీట్లు వస్తాయని లెక్కలు గట్టిన సర్వే మిగతా ఐదు సీట్లు బీజేపీ ఖాతాలోకి వెళతాయని చెప్పింది. 2014 లోక్సభ ఎన్నికల్లో దేశమంతా మోడీ పవనాలు వీస్తున్నప్పటికీ ఒడిషాలో మాత్రం నవీన్ పట్నాయక్ హవానే కొనసాగింది. ఆ సమయంలో బీజేడీ 20 సీట్లు గెలువగా మిగతా ఏడు సీట్లు కమలం పార్టీ నెగ్గింది. ఇక్కడ కాంగ్రెస్కు నిరాశే మిగిలింది. ఇక ఓటు షేరును పరిశీలిస్తే 2014లో బీజేడీకి 44.77శాతం రాగా ఈ సారి అది స్వల్పంగా తగ్గి 44శాతానికి చేరుకోనుంది. బీజేపీకి 2014లో ఓటు శాతం 21.88శాతం ఉండగా అది ఇప్పుడు పెరిగి 28.53 శాతానికి చేరుకోనుందని సీఎన్ఎక్స్ సర్వే తెలిపింది. మరోవైపు కాంగ్రెస్ ఓటు శాతం 21.67శాతం ఉన్నప్పటికీ ఒక్క సీటు కూడా గెలవదని సర్వే తెలిపింది.
ప్రధానిగా మోడీకి ప్రజల మద్దతు
ఇక ప్రధాని పదవిలో ఎవరు ఉంటే బాగుంటుందన్న ప్రశ్నకు ఉత్తర్ ప్రదేశ్, వెస్ట్ బెంగాల్, ఒడిషా రాష్ట్రాల్లోని 42 శాతం మంది ప్రజలు నరేంద్ర మోడీకి మద్దతు తెలిపారు.మరోవైపు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ 19 శాతంతో ప్రధాని రేసుకు చాలా వెనకబడి ఉన్నారు. ఇక ప్రధానిగా మాయావతికి, మమతా బెనర్జీకి 11శాతం మంది ప్రజలు మద్దతు పలుకగా 6శాతం మంది ప్రజలు అఖిలేష్ యాదవ్ను సపోర్ట్ చేశారు.