రామ మందిరం ట్రస్ట్ చైర్మన్కు తీవ్ర అస్వస్థత - మహంత్ నృత్య గోపాల్ దాస్ పరిస్థితి ఇదీ
అయోధ్యలో భవ్యరామ మందిరం నిర్మాణం కోసం ఏర్పాటైన 'శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్' ఛైర్మన్ మహంత్ నృత్య గోపాల్ దాస్ ఆరోగ్యం బాగా క్షీణించింది. కొంత కాలంగా అయోధ్యలోని మణిరామ్ దాస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోన్న ఆయన పరిస్థితి సోమవారం రాత్రి విషమించడంతో హుటాహుటిన లక్నోలోని మేదాంత ఆస్పత్రికి తరలించారు.
శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, గుండే వేగం పెరగడంతో మెరుగైన వైద్యం కోసం మహంత్ దాస్ ను అయోధ్య నుంచి లక్నో కి తరలించినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం లక్నోలోని మేదాంత ఆస్పత్రి ఇంటెన్సివ్ కేర్ విభాగంలో, డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ కపూర్ ఆదేశాల మేరకు ఉన్నత స్థాయి నిపుణుల బృందం మహంత్ కు చికిత్స అందిస్తున్నదని అధికారులు బులిటెన్ జారీ చేశారు.
గత ఆగస్టులో అయోధ్య మందిరం భూమి పూజ తర్వాత ట్రస్టు చైర్మన్ మహంత్ నృత్య గోపాల్ దాస్ కరోనా బారినపడ్డారు. మధురలో ఉన్నప్పుడు పాజిటివ్ గా తేలిన ఆయన గురుగ్రామ్లోని మేదాంత ఆస్పత్రిలో చికిత్స పొంది, కోలుకున్నారు. కానీ మళ్లీ కొద్ది రోజుల కిందట అనారోగ్యానికి గురికావడంతో ఆస్పత్రిలో చేరారు.