అక్బర్ అంత గొప్పవాడేం కాదు, మహారాణా ప్రతాప్ చాలా గొప్ప: యోగి ఆదిత్యనాథ్
లక్నో: ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అక్బర్ ఏమంత గొప్పవాడు కాదని, అసలు మహారాణా ప్రతాప్ చాలా గొప్పవాడు అని చెప్పారు. అక్బర్ను రాజుగా గుర్తించేందుకు రాణా ప్రతాప్ నిరాకరించాడన్నారు.
అరావళి పర్వతాల్లో ఉన్న తన కోటలను తిరిగి దక్కించుకోవడానికి ఏళ్ల తరబడి పట్టు వదలకుండా ప్రయత్నించాడని కొనియాడారు. మేవార్ రాజు జయంతి వేడుకలను పురస్కరించుకుని ఆరెస్సెస్ నిర్వహించిన కార్యక్రమంలో యోగి మాట్లాడారు.
రాణా ప్రతాప్ మరణించి 500 ఏళ్లయినా ఆయనను గుర్తు చేసుకుంటున్నామన్నారు. ఈ సందర్భంగా 1576లో జరిగిన హల్దిఘాటి యుద్ధాన్ని గుర్తు చేశారు. ఈ యుద్ధంలో ఎవరు గెలిచారన్నది పక్కనపెడితే అరావళి పర్వతాల్లో రాణా ప్రతాప్ ఏళ్ల తరబడి పోరాడి చివరికి విజయం సాధించి తన కోటలను తిరిగి సాధించుకున్నాడన్నారు.
ధీరత్వానికి, శూరత్వానికి మహారాణా ప్రతాప్ ప్రతీక అన్నారు. తన కోటులను తిరిగి సొంతం చేసుకున్న ఆయన చాలా గొప్పవాడన్నారు. తనను రాజుగా అంగీకరిస్తే మేవార్ రాజ్యంలో జోక్యం చేసుకోనని అక్బర్ చెప్పినా మహారాణా ప్రతాప్ అంగీకరించలేదన్నారు. జైపూర్ రాజు మాన్ సింగ్ మధ్యవర్తిత్వానికి కూడా అంగీకరించలేదన్నారు.
నేను అక్బర్ను అంగీకరించే ప్రసక్తే లేదని, అతనిని నమ్మలేమని, మన స్వాభిమానాన్ని అతను దెబ్బతీశాడని, మనం ఎట్టి పరిస్థితుల్లో విదేశీయుడిని రాజుగా అంగీకరించలేమని మహారాణా ప్రతాప్ చెప్పారని యోగి గుర్తు చేశారు.