మహారాష్ట్రలో మళ్లీ కరోనా విజృంభణ: 10వేలకుపైగా కొత్త కేసులు, ఢిల్లీలోనూ పెరిగిన కేసులు
న్యూఢిల్లీ/ముంబై: మహారాష్ట్రలో మరోసారి కరోనావైరస్ విజృంభిస్తోంది. గత కొద్ది రోజులుగా కొత్తగా కేసులు పెరుగుతుండగా.. తాజాగా ఏకంగా 10వేలు దాటడం గమనార్హం. దేశ వాణిజ్య రాజధాని ముంబైతోపాటు దేశ రాజధాని న్యూఢిల్లీలోనూ కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి.
మహారాష్ట్రలో 10వేలకుపైగా కొత్త కేసులు
గత 24 గంటల వ్యవధిలోనే మహారాష్ట్రలో 10,216 కొత్త కరోనా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగించే అంశంగా మారింది. కరోనాబారినపడి 53 మంది మరణించారు. కరోనా కట్టడికి ప్రభుత్వం చర్యలు చేపడుతున్నా కూడా కొత్త కేసులు భారీగా పెరుగుతుండటం గమనార్హం.
దేశంలో సగం యాక్టివ్ కేసులు మహారాష్ట్రలోనే..
తాజాగా, ఒక్క ముంబై నగరంలోనే 1,173 కరోనా కేసులు నమోదయ్యాయి. ముగ్గురు మరణించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కరోజు వ్యవధిలో 6467 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1,66,86,880 నమూనాలను పరీక్షించగా.. 21,98,399 మందికి కరోనా సోకినట్లు తేలింది. వీరిలో 20,55,951 మంది కోలుకున్నారు. 52,393 మంది కరోనాతో మరణించారు. రికవరీ రేటు 93.5 శాతంగా ఉంది. ప్రస్తుతం మహారాష్ట్రలో 88,838 యాక్టివ్ కేసులున్నాయి. దేశంలో మొత్తం కేసుల్లో ఇక్కడే సగం యాక్టివ్ కేసులు ఉండటం గమనార్హం.
ఢిల్లీలోనూ పెరుగుతున్న కరోనా కేసులు
మరోవైపు దేశ రాజధాని న్యూఢిల్లీలోనూ కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. కొత్తగా 59,112 నమూనాలను పరీక్షించగా.. 312 మందికి కరోనా సోకినట్లు తేలింది. మూడు మరణాలు నమోదయ్యాయి. జనవరి 14 తర్వాత గరిష్ట కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇప్పటి వరకు 1,26,81,441 నమూనాలను పరీక్షించగా.. 6,40,494 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 6,27,797 మంది కోలుకోగా, 10,918 మంది కరోనాతో మరణించారు. ప్రస్తుతం ఢిల్లీలో 1779 యాక్టివ్ కేసులున్నాయి. కాగా, దేశంలో కరోనా కేసులు మరోసారి భారీ పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 16,838 కొత్త కరోనా కేసులు వెలుగుచూశాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1,11,73,761కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 113 మంది మరణించగా.. ఇప్పటి వరకు కరోనా మరణాల సంఖ్య 1,57,548కు చేరింది. కాగా, గురువారం ఒక్కరోజే 13,819 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు కరోనా నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 1.08 కోట్లకుపైబడింది. ప్రస్తుతం దేశంలో 1,76,319 యాక్టివ్ కేసులున్నాయి.