బడ్జెట్ సమావేశాల వేళ.. అసెంబ్లీలో కలకలం: 36 మందికి పాజిటివ్
ముంబై: మహారాష్ట్రలో ప్రాణాంతక కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తోంది. ఇప్పటికే రోజూ వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు పుట్టుకొస్తున్నాయక్కడ. విదర్భ రీజియన్లోని కొన్ని జిల్లాల్లో పాక్షికంగా లాక్డౌన్ అమల్లో ఉంటోంది. రోజువారీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యకు అనుగుణంగా మరణాలు కూడా క్రమంగా పెరుగుదల బాట పట్టాయి. కరోనా కేసుల తీవ్రత అసెంబ్లీని కూడా తాకింది. 36 మంది సిబ్బందికి వైరస్ సోకింది. వారిని కోవిడ్ కేర్ సెంటర్లకు తరలించారు. కొందరు హోమ్ ఐసొలేషన్లో ఉంటోన్నారు.
మహారాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను దృష్టిలో ఉంచుకుని ముందు జాగ్రత్త చర్యగా పలువురు ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బంది, ఎమ్మెల్యేల వ్యక్తిగత కార్యదర్శుల నమూనాలను జేజే ఆసుపత్రి నర్సులు సేకరించారు. 6, 7 తేదీల్లో దీనికోసం ప్రత్యేకంగా అసెంబ్లీ ఆవరణలో ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ రెండు రోజుల్లో 2,746 మంది ఉద్యోగులు, సిబ్బంది నమూనాలను సేకరించారు. వాటిని పరీక్షలకు పంపించగా.. 36 మందికి కరోనా వైరస్ సోకినట్లు తేలింది. వారిని అసింప్టోమేటిక్గా నిర్ధారించారు.
కరోనా వైరస్ సోకిందనడానికి ఎలాంటి లక్షణాలు వారిలో కనిపించలేదని జేజే ఆసుపత్రి డాక్టర్లు చెప్పారు. వారి ద్వారా మరింత మందికి వైరస్ సోకి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమౌతోన్నాయి. ఎమ్మెల్యేలకూ పరీక్షలను నిర్వహించారు. మహారాష్ట్ర వైద్య శాఖ ఆదివారం విడుదల చేసిన రోజువారీ కరోనా నివేదిక ప్రకారం.. 24 గంటల వ్యవధిలో కొత్తగా 11,141 పాజిటివ్ కేసులు నమోదయ్యాయంటే.. అక్కడ ఏ స్థాయిలో వైరస్ వ్యాప్తి చెందుతోందనేది అర్థం చేసుకోవచ్చు.
మహారాష్ట్రలో ఇప్పటిదాకా నమోదైన మొత్తం కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 22,19,727కు చేరుకోగా.. 20,68,044 మంది డిశ్చార్జ్ అయ్యారు. 52,478 మంది మరణించారు. ఇప్పటికీ- 97,983 యాక్టివ్ కేసులు అక్కడ కొనసాగుతోన్నాయి. అత్యధిక కేసులు పుణేలో రికార్డ్ అయ్యాయి. 4,21,162 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ముంబై-3,33,569, థానె-2,85,729 కేసులు రికార్డ్ అయ్యాయి. పుణేలో కరోనా మరణాల సంఖ్య అధికంగా ఉంది. ఆ ఒక్క నగరంలోనే 20,347 మంది మృత్యువాత పడ్డారు.