క్షుద్రపూజ..ఒంటిపై దుస్తులు లేకుండా: మైనర్ బాలికకు రూ.50 కోట్లు ఎర
ముంబై: మహారాష్ట్రలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కోట్ల రూపాయల డబ్బుల వాన కురుస్తుందంటూ ఆశ చూపిన అయిదుమంది యువకులు.. ఓ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడే ప్రయత్నం చేశారు. దీనికోసం వారు మూఢనమ్మకాల మార్గాన్ని ఎంచుకున్నారు. ఒంటిపై దుస్తులు లేకుండా నగ్నంగా క్షుద్రపూజలు చేయాల్సి ఉంటుందంటూ బాలికను బలవంత పెట్టారు. ఈ ఘటనకు పాల్పడిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిపై పోక్సో సహా పలు చట్టాల కింద కేసు నమోదు చేశారు. స్థానికంగా ఈ ఉదంతం కలకలం రేపింది. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ మహిళా సంఘాలు డిమాండ్ చేస్తోన్నాయి.
రూ.50 కోట్ల ఆశ
మహారాష్ట్రలోని నాగ్పూర్లో కిందటి నెల 25వ తేదీ ఈ ఘటన చోటు చేసుకుంది. అరెస్ట్ చేసిన నిందితులను పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. నాగ్పూర్లోని లకడ్గంజ్లో నివసించే పేద కుటుంబానికి చెందిన ఓ బాలికపై అదే ప్రాంతానికి చెందిన అయిదుమంది యువకులు కన్నేశారు. ఆమెను లొంగదీసుకోవడానికి పథకం పన్నారు. ఆమెకు 50 కోట్ల రూపాయలను ఇస్తామని ఆశ చూపారు. క్షుద్రపూజలు చేస్తే.. కనకవర్షం కురుస్తుందని నమ్మించారు. కిందటి నెల 25 తేదీన రాత్రి ఆ బాలికతో క్షుద్రపూజలు చేయించడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు.
చెప్పినట్టు చేస్తే.. కనకవర్షం
తాము చెప్పినట్లు క్షుద్రపూజలు చేస్తే కోటీశ్వరురాలివి అవుతావని ఆశపెట్టారు. దీనికోసం కొన్ని పూజలు చేయాల్సి ఉంటుందని సూచించారు. దీనికి అంగీకరించిన ఆ బాలిక క్షుద్రపూజలు చేయడానికి అంగీకరించారు. పూజ చేసే సమయంలో వారు దస్తులు విప్పాలని ఆ బాలికను ఆదేశించాడు. దీనికి ఆమె అంగీకరించలేదు. నగ్నంగా పూజ చేస్తేనే డబ్బుల వర్షం కురుస్తుందని ఒత్తిడి చేశారు. అయినప్పటికీ.. ఆమె లొంగేలదు. వారి బారి నుంచి ఆ బాలిక తప్పించుకుని, పోలీసులను ఆశ్రయించారు.
పీడీ యాక్ట్ సహా..
కిందటి నెల 26వ తేదీన లకడ్గంజ్ పోలీస్ స్టేషన్లో నిందితులపై ఫిర్యాదు చేశారామె. బాలిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. మూడు రోజుల వ్యవధిలో అయిదుమందినీ అరెస్టో చేశారు. విక్కీ గణేష్ ఖాప్రే, దినేష్ మహదేవ్ నిఖారే, రామకృష్ణ దాదాజీ మష్కర్, వినోద్ జయరామ్ మస్రం, డీఆర్ అలియాస్ సోపాన్ హరిభావ్ కుమ్రేను అరెస్ట్ చేశారు. వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. మహారాష్ట్ర ప్రీవెంటివ్ అండ్ డిటెన్షన్ చట్టం, అసాంఘిక కార్యకలాపాల నిరోధకం చట్టం, క్షుద్రపూజలు, చేతబడి నిరోధక చట్టం, పోక్సో కింద కింద కేసులు నమోదు చేశారు.
తొలుత ఒక్కడితో అరెస్ట్..
ఈ కేసులో లకడీగంజ్ పోలీసులు విక్కీ గణేష్ ఖప్రెను అరెస్ట్ చేశారు. అతనే ప్రధాన నిందితుడిగా గుర్తించారు. దర్యాప్తు సందర్భంగా అతను ఇచ్చిన సమాచారం మేరకు మిగిలిన నలుగురిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. మూఢనమ్మకంతోనే ఆ బాలికను అయిదుమంది నిందితులు వంచించడానికి ప్రయత్నించారని, చివరి నిమిషంలో ఆమె తప్పించుకోగలిగారని అన్నారు. ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని సొమ్ము చేసుకోవాలని ప్రయత్నించే వారు తమ దృష్టికి వచ్చిన వెంటనే తమకు తెలియజేయాలని, వారి మాయమాటలను విశ్వసించొద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు. నారు.