దర్శకుడిపై రేప్ ఆరోపణలు చేసిన నటి పొలిటికల్ ఎంట్రీ: బీజేపీకి మిత్రపక్షంలో: కీలక పదవి కూడా
ముంబై: ప్రముఖ నటి పాయల్ ఘోష్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. కొద్దిసేపటి కిందట ఆమె రాజకీయ రంగ ప్రవేశం చేశారు. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్పీఐ)లో చేరారు. కేంద్రమంత్రి రామ్దాస్ అథవాలే సారథ్యంలోని పార్టీ ఇది. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్య పార్టీగా కొనసాగుతోంది. చేరిన వెంటనే పాయల్ ఘోష్కు కీలక పదవిని అప్పగించింది ఆ పార్టీ అగ్ర నాయకత్వం. పాయల్ ఘోష్ను పార్టీ మహిళా విభాగానికి ఉపాధ్యక్షురాలిగా నియమించింది.
బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్పై అత్యాచార ఆరోపణలను సంధించిన తరువాత ఆమె పేరు ఒక్కసారిగా దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. అనురాగ్ కశ్యప్ తనపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆమె ఇదివరకు ఆరోపణలను గుప్పించారు. ఈ మధ్యాహ్నం ఆమె ముంబైలోని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా కార్యాలయానికి చేరుకున్నారు. పార్టీ అధినేత, కేంద్రమంత్రి రామ్దాస్ అథవాలేను కలిశారు. ఆయన సమక్షంలో పార్టీ తీర్థాన్ని పుచ్చుకున్నారు. రామ్దాస్ అథవాలే.. పార్టీ కండువాను కప్పి ఆమెను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆమెను పార్టీ మహిళా విభాగానికి ఉపాధ్యక్షురాలిగా నియమించారు.
అనురాగ్ కశ్యప్ తనని లైంగికంగా వేధించాడని, అత్యాచారం చేశాడంటూ కొద్ది రోజుల కిందట పాయల్ ఘోష్ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆమె జాతీయ స్థాయిలో పోరాడుతున్నారు. అత్యాచార ఆరోపణలను ఎదుర్కొంటున్న అనురాగ్ కశ్యప్పై చర్యలు తీసుకోవాలని కోరుతూ దేశ రాజధానిలోని జాతీయ మహిళా కమిషన్ను కలిశారు. ఈ కేసుకి సంబంధించి విచారణ పూర్తి చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
లైంగిక వేధింపుల కేసు ప్రస్తుతం కొనసాగుతోంది. కేసు విచారణలో భాగంగా ముంబైలోని వెర్సోవా పాలసీ పోలీసులు అనురాగ్ కశ్యప్ను అదుపులోకి తీసుకున్నారు. సుమారు ఎనిమిది గంటలు విచారించారు. ఈ పరిస్థితుల్లో పాయల్ ఘోష్ రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వడం ఆసక్తి రేపుతోంది. రాజకీయంగా అనురాగ్ కశ్యప్పై కక్షసాధింపు చర్యలకు పాయల్ ఘోష్ దిగుతారా? లేదా? అనేది చర్చనీయాంశమౌతోంది. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా మహిళా విభాగానికి ఉపాధ్యక్షురాలిగా కూడా నియమితులు కావడంతో అత్యాచార ఆరోపణల కేసు సరికొత్త మలుపులు తిరిగే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.