ఎగ్జిట్ పోల్స్: దుమ్ములేపిన బీజేపీ, తుస్సు మన్న కాంగ్రెస్, 370 రద్దు, పాకిస్థాన్ కుట్ర !
ముంబై/న్యూఢిల్లీ: మహారాష్ట్ర, హర్యానా శాసన సభ ఎన్నికల ఓటింగ్ పూర్తి కావడంతో రెండు రాష్ట్రాల్లో ఎవరు అధికారంలో వస్తారు అనే ఉత్కంఠ మొదలైయ్యింది. మహారాష్ట్ర, హర్యానాలో ప్రస్తుతం బీజేపీనే అధికారంలో ఉంది. సోమవారం రాత్రి పలు సర్వేల ఎగ్జిట్ పోల్స్ విడుదల అయ్యాయి. ఏ ఎగ్జిట్ పోల్స్ వివరాలు పరిశీలించినా మహారాష్ట్ర, హర్యానాలో మళ్లీ బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. మహారాష్ట్ర, హర్యానాలో ఎలాంటి పరిస్థితుల్లో ప్రతిపక్షాలు అధికారంలోకి వచ్చే అవకాశం లేదని ఎగ్జిట్ పోల్స్ అభిప్రాయం వ్యక్తం చేశాయి. సోమవారం ఉదయం రెండు రాష్ట్రాల్లో ఓటింగ్ ప్రారంభం అయినప్పటి నుంచి కచ్చితంగా రెండు రాష్ట్రాల్లో తామే మళ్లీ అధికారంలో వస్తామని బీజేపీ నాయకులు చెప్పారు. ఆర్టికల్ 370 రద్దు, పాకిస్థాన్ కుట్రలను ప్రచారం చెయ్యడంలో బీజేపీ అన్ని విధాలుగా కలిసి వచ్చింది.
మహారాష్ట్రలో రూ. 142 కోట్లు, 975 ఆయుధాలు సీజ్, ఆ డబ్బు ఎవరిదంటే, సినీ తారలు !
బీజేపీ ర్యాలీలు 50, కాంగ్రెస్ ర్యాలీలు 7
మహారాష్ట్ర, హర్యానా శాసన సభ ఎన్నికల సందర్బంగా ప్రచారంలో బీజేపీ దూసుకుపోయింది. ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షాతో పాటు పలువురు బీజేపీ సీనియర్ నాయకులు 50పైగా జరిగిన ర్యాలీల్లో పాల్గొని బీజేపీకి ఓటు వెయ్యాలని మనవి చేశారు. బీజేపీ మిత్రపక్షాలు సైతం తమదైన శైలిలోప్రచారం చేశాయి. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే రెండు రాష్ట్రాల్లో కేవలం 7 ర్యాలీలతో సరిపెట్టుకుని ప్రచారంలో వెనుకబడి పోయింది.
కాంగ్రెస్ కు నాయకత్వం లోటు !
మహారాష్ట్ర, హర్యానా శాసన సభ ఎన్నికల సందర్బంగా కాంగ్రెస్ కు నాయకత్వం లోటు ఉందని స్పష్టంగా కనపడింది. యూపీఏ చైర్మన్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ శాసన సభ ఎన్నికల ప్రచారంలో ఓటర్లను ఆకర్షించలేకపోయారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎంపికలో సైతం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సరైన నిర్ణయం తీసుకోలేదని, ఆ దెబ్బ శాసన సభ ఎన్నికల మీద ప్రభావం చూపించిందని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు అంటున్నారు.
మహారాష్ట్ర దెబ్బ
మహారాష్ట్రలో బీజేపీ, శివసేన పార్టీల కూటమి కచ్చితంగా అధికారంలో వస్తుందని పలు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. బీజేపీ, శివసేన, ఆ పార్టీల మిత్రపక్షాలు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పక్కాప్లాన్ తో ముందుకు వెళ్లాయని, ప్రతిపక్షాల ఆరోపణలకు సరైన సమాధానం ఇచ్చాయని వెలుగు చూసింది. బీజేపీ అధికారంలోకి వస్తేనే ప్రజల సమస్యలు పరిష్కరించడానికి అవకాశం ఉందని, మమ్మల్ని ఆశీర్వదించాలని బీజేపీ నాయకులు ప్రచారం చేశారు.
ప్రధాని ప్రభావం
మహారాష్ట్ర, హర్యానా శాసన సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రచారం ఊహించని విధంగా పని చేసిందని సోమవారం రాత్రి మరాఠీ దిన పత్రికల ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా పక్కా ఎన్నికల వ్యూహంతో ముందుకు వెళ్లారని, ప్రతిపక్షాల మీద దుమ్మెత్తి పోశారని మరాఠీ మీడియా చెప్పింది. అధికారంలో ఉన్న బీజేపీని ఎదుర్కోవడంలో కాంగ్రెస్, ఆ పార్టీ మిత్రపక్షాలు పూర్తిగా విఫలం అయ్యాయని మరాఠీ మీడియా వెల్లడించింది.
ఆర్టికల్ 370 దెబ్బ
జమ్మూ కాశ్మీర్ లో ఎందుకు ఆర్టికల్ 370 రద్దు చేశాము అనే విషయంపై ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా క్షుణ్ణంగా వివరించారు. ఆర్టికల్ 370 రద్దు తరువాత మొదటి సారి శాసన సభ ఎన్నికలు జరిగాయి. శాసన సభ ఎన్నికల ప్రచారం సమయంలో ఆర్టికల్ 370 రద్దు గురించి, పాకిస్తాన్ కుట్రల గురించి ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా ప్రజలకు వివరించారు. ఇదే సమయంలో ప్రధాని మోడీ, అమిత్ షాల ఆరోపణలు తిప్పికొట్టడంలో కాంగ్రెస్ పార్టీతో సహ వాటి మిత్రపక్షాలు నీళ్లు నమలడంతో ఓటర్లను ఆకర్షించలేకపోయింది. మొత్తం మీద ఎగ్జిట్ పోల్స్ విడుదల అయిన తరువాత బీజేపీ, ఆ పార్టీ మిత్రపక్షాలు సంతోషంగా ఎన్నికల ఫలితాల కోసం ఎదురు చూస్తున్నాయి.