కోటి ఉద్యోగాలు... అందరికీ ఇళ్లు: మహారాష్ట్ర ఎన్నికలకు బీజేపీ మేనిఫెస్టో ఇదే..!
ముంబై: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల హీట్ పెరుగుతోంది. ఇప్పటికే ఆయా పార్టీలు తమ మేనిఫెస్టోలను విడుదల చేశాయి. ఇక తాజాగా అధికార భారతీయ జనతా పార్టీ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు తమ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసింది. ఇందులో యువతను, నిరుద్యోగులను, విద్యార్థులను ఆకట్టుకునే అంశాలను చేర్చింది. ఈ మేనిఫెస్టోను ముఖ్యమంత్రి ఫడ్నవీస్, బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాలు ముంబైలో విడుదల చేశారు.
నిరుద్యోగులను ఆకట్టుకునేలా..
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీ తన మేనిఫెస్టోను విడుదల చేసింది. ఇందులో ప్రధానంగా నిరుద్యోగులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. వారికోసం కోటి ఉద్యోగాలను భర్తీ చేస్తామని బీజేపీ తమ మేనిఫెస్టోలో పొందుపర్చింది. అయితే ఆర్థిక మాంద్యంతో కేంద్రప్రభుత్వమే ఉద్యోగాలు ఇవ్వడం కష్టంగా మారిందని కోటి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నిరుద్యోగులను మరోసారి మోసం చేసేందుకు బీజేపీ తెరలేపుతోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇక రానున్న ఐదేళ్లలో గ్రామీణప్రాంతాల్లో 30వేల కిలోమీటర్ల మేరా రహదారుల నిర్మాణం చేపడుతామని మేనిఫెస్టోలో పొందుపర్చింది.
నీటికొరత సమస్యను పరిష్కరిస్తాం
అందరికీ ఇళ్లను నిర్మించి ఇస్తామని మధ్య తరగతి, దిగువ మధ్యతరగతి వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఇదే అంశమై ప్రతి ఒక్కరికీ ఇళ్లు అని మేనిఫెస్టోలో పొందుపర్చింది. ఇక మహారాష్ట్రలో తాగునీటి కొరత ఎప్పుడూ ఉండనే ఉంటుంది. దీనిపై ప్రత్యేక దృష్టి సారించింది బీజేపీ. తిరిగి అధికారంలోకి వస్తే నీటికొరత సమస్యను పరిష్కరిస్తామంటూ మేనిఫెస్టోలో చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే విలువలతో కూడిన నాణ్యమైన విద్యకు పెద్ద పీట వేస్తామని కమలం పార్టీ మరో అంశంగా మేనిఫెస్టోలో చేర్చింది.
డీవీ సావర్కర్, జ్యోతిరావు ఫూలేలకు భారతరత్న
ఆయా వర్గాల ఓట్లను ఆకర్షించేందుకు బీజేపీ ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు వీడీ సావర్కర్, సామాజిక కార్యకర్త అంటరానితనంపై పోరాటం చేసిన జ్యోతిరావు ఫూలే, సావిత్రిభాయ్ ఫూలేలకు దేశఅత్యున్నత పౌరపురస్కారం భారతరత్నతో గౌరవిస్తామని మేనిఫెస్టోలో పొందుపర్చింది. మొత్తానికి అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా అత్యంత జాగ్రత్తలు తీసుకుంటూ బీజేపీ మహారాష్ట్ర ఎన్నికల మేనిఫెస్టోను రూపొందించింది. అక్టోబర్ 21 మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ 24న ఫలితాలు వెలువడుతాయి. శివసేన బీజేపీలు పొత్తులో భాగంగా కలిసి పోటీచేస్తుండగా .. మరోవైపు కాంగ్రెస్ ఎన్సీపీలు కలిసి పోటీ చేస్తున్నాయి.