మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు 2019: సెలవు ప్రకటించిన దేశీయ స్టాక్ మార్కెట్లు
ముంబై: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో దేశీయ ఈక్విటీ మార్కెట్లు సెలవు ప్రకటించాయి. యాక్సిస్ బ్యాంక్, భారతీ ఇన్ఫ్రాటెల్, హిందుస్తాన్ జింక్, జస్ట్ డయల్, పిరమాల్ ఎంటర్ప్రైజెస్, అల్ట్రా టెక్ సిమెంట్లు తమ త్రైమాసిక ఫలితాలను వెల్లడించనున్నాయి. ఇక గత ఆరు సెషన్లలో లాభాల బాటపట్టిన దేశీయ మార్కెట్లు తమ ట్రేడింగ్ను తిరిగి మంగళవారం ప్రారంభిస్తాయి.
హర్యానాలో 90 స్థానాలకు మహారాష్ట్రలో 288 సీట్లకు సోమవారం పోలింగ్ జరుగుతోంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. 4,400 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇందులో హర్యానాలో 1,169 మంది అభ్యర్థులు బరిలో నిలువగా.. 3,237 మంది అభ్యర్థులు మహారాష్ట్ర అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు.వీటి ఫలితాలు అక్టోబర్ 24న వెలువడనున్నాయి.
బ్రెగ్జిట్ నుంచి వైదొలిగే అంశంపై నిర్ణయం తీసుకునేందుకు అక్టోబర్ 31 వరకు గడవు పొడిగించాలని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ను బలవంతం చేసింది ఆదేశ పార్లమెంటు.ప్రస్తుతం ఇన్వెస్టర్లు బ్రెగ్జిట్ వ్యవహారంపై చాలా ఆసక్తితో గమనిస్తున్నారు. అంతేకాదు సరిహద్దుల్లో పరిస్థితులను కూడా ఇన్వెస్టర్లు నిశితంగా పరిశీలిస్తున్నారు.
ఇక ఏషియాలోని ఇతర దేశాల్లో ట్రేడింగ్ యధావిధిగా సాగుతోంది. జపాన్ బయట ఏషియా పసిఫిక్ షేర్లు ఫ్లాట్గా ట్రేడ్ అవుతున్నాయి. ఆస్ట్రేలియా షేర్లు 0.3శాతానికి పడిపోగా జపాన్కు చెందిన నిక్కీ షేర్లు 0.3 శాతం పెరిగాయి. ఇదిలా ఉంటే శుక్రవారం బీఎస్ఈ సెన్సెక్స్ 246 పాయింట్లు పెరిగి 39,298.38 పాయింట్ల వద్ద ముగిసింది. మరోవైపు నిఫ్టీ 75 పాయింట్లు పెరిగి 11,661.85 దగ్గర ముగిసింది.