కమలేశ్ హత్య కేసులో నాలుగో నిందితుడి అరెస్ట్.. నాగ్పూర్లో సయ్యద్ పట్టుకున్న ఏటీఎస్
హిందూ సమాజ్ పార్టీ నేత కమలేశ్ తివారీ హత్య కేసులో ఏటీఎస్ పోలీసులు మరొకరిని అరెస్ట్ చేశారు. ఇప్పటికే ముగ్గురిని అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్వ్కాడ్ నాగ్ పూర్ లో సయ్యద్ అసిమ్ అలీ అనే అతడిని అరెస్ట్ చేసింది. కమలేశ్ హత్య కేసులో ఇప్పటికే పోలీసులు రషీద్, మోషిన్, ఫైజాన్ అనే ముగ్గురిని అరెస్ట్ చేశారు. వీరిని సూరత్లో పట్టుకున్నారు.
నాగ్ పూర్ లో సయ్యద్ కు హార్డ్ వేర్ షాపు ఉంది. కమలేశ్ హత్యకు సంబంధించి మరొకరి పాత్ర ఉందని పోలీసులకు సమాచారం అందడంతో రంగంలోకి దిగారు. ఇన్ఫో ఆధారంగా అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఆ ముగ్గురితో సయ్యద్కు సంబంధం ఉందని పోలీసులు తేల్చారు. అంతేకాదు కమలేశ్ హత్యలో సయ్యద్ కీ రోల్ పోషించారని పోలీసులు చెప్తున్నారు. రషీద్ సయ్యద్ తో మాట్లాడినట్టు విచారణలో తేలిందన్నారు. అంతేకాదు కమలేశ్ తివారీకి వ్యతిరేకంగా యూట్యూబ్ లో సయ్యద్ వీడియో అప్ లోడ్ చేశారని పేర్కొన్నారు. కమలేశ్ తివారీ ముస్లింలను కించపరిచారని ఆ వీడియోలో సయ్యద్ పేర్కొన్నారు. మహ్మద్ ప్రవక్తను నిందించారని తెలిపారని చెప్పారు. దాంతోనే కమలేశ్ ను చంపేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు.
లక్నోలోని తన కార్యాలయంలో కమలేశ్ ఉండగా శుక్రవారం మధ్యాహ్నం ముగ్గురు కాషాయ వస్త్రాలు ధరించి లోపలికి వచ్చారు. రెండు స్వీట్ బాక్సులు తమ వెంట తీసుకొచ్చారు. అందుల్లోంచి తుపాకీ తీసి కాల్చారు. తర్వాత కత్తితో గొంతు కోశారు. దాదాపు 15 సార్లు కత్తితో పొడిచినట్టు సీసీటీవీ ఫుటేజీలో కనిపించింది. తర్వాతే అక్కడినుంచి పారిపోయినట్టు విజువల్లో కనిపించింది. ఘటనాస్థలంలో పిస్టోల్, బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకొని.. విచారణ చేపట్టారు. ముగ్గురు అనుమానితులను అరెస్ట్ చేశారు. సోమవారం మరొకరిని అదుపులోకి తీసుకున్నారు.