కరోనా : 1000 మార్క్ దాటిన మహారాష్ట్ర.. దేశంలోనే మొదటి రాష్ట్రం..
మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1018కి చేరింది. మంగళవారం(ఏప్రిల్ 7) ఒక్కరోజే 150 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలోనే కరోనా పాజిటివ్ కేసుల్లో వెయ్యి మార్క్ దాటిన మొదటి రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచింది. కొత్తగా నమోదైన కేసుల్లో ముంబైలో అత్యధికంగా 116,పుణేలో 18, అహ్మద్నగర్లో ,నాగ్పూర్,ఔరంగాబాద్లలో 3,బుల్దానా,థాణేలో రెండు కేసులు నమోదయ్యాయి. అలాగే ఒక్క ముంబై నగరంలోనే మంగళవారం ఐదు కరోనా మృతి కేసులు నమోదయ్యాయి.
ఈ ఐదుగురిలో ఒక పేషెంట్ మార్చి 30నే మృతి చెందాడని.. పోస్టుమార్టమ్ రిపోర్టులో కరోనా పాజిటివ్గా తేలిందని వైద్యాధికారులు తెలిపారు. మరో ముగ్గురిలో వ్యాధి లక్షణాలతో పాటు అప్పటికే ఇతర వ్యాధులు కూడా ఉండటంతో మృతి చెందినట్టు తెలిపారు. ఇక మరో వ్యక్తిలో కరోనాకు తోడు వయసు రీత్యా వచ్చిన సమస్యల కారణంగా మృతి చెందినట్టు తెలిపారు.కొత్త కేసుల సంఖ్య ఎక్కువగా ఉండటానికి కారణంగా హైరిస్క్ కంటైన్మెంట్ ప్రాంతాల్లో ఎక్కువ టెస్టులు నిర్వహించడమేనని తెలిపారు.
ఇక దేశవ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4789కి చేరింది. మృతుల సంఖ్య 124కి చేరింది. ఇప్పటివరకు 352 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మహారాష్ట్ర తర్వాత 690 పాజిటివ్ కేసులతో తమిళనాడు,576 పాజిటివ్ కేసులతో ఢిల్లీ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. కేసుల సంఖ్య వేగంగా పెరుగుతుండటం.. ఆయా రాష్ట్రాల నుంచి వినిపిస్తున్న విజ్ఞప్తుల మేరకు లాక్ డౌన్ పొడగించవచ్చునన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నెల 8వ తేదీన జరిగే ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగే అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్ల సమావేశంలో దీనిపై ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం కనిపిస్తోంది.