ఆ మాజీ సీఎం నా జీవితాన్ని నాశనం చేశాడు..నేనుండలేను: బీజేపీకి మాజీ మంత్రి రాజీనామా
ముంబై: మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. స్థానిక సంస్థలను ఎదుర్కొనడానికి సమాయాత్తమౌతోన్న బీజేపీకి ఆ పార్టీ సీనియర్ నేత, మాజీమంత్రి ఏక్నాథ్ ఖడ్సే గుడ్బై చెప్పారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికీ రాజీనామా చేశారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు చంద్రకాంత్ దాదా పాటిల్కు తన రాజీనామా పత్రాన్ని పంపించారు. తాను వ్యక్తిగత కారణాలతో పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఏకవాక్యంతో తేల్చారు. త్వరలోనే ఆయన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)లో చేరబోతున్నారు.
వెడ్డింగ్ ఫొటోషూట్..వెరైటీ: క్రికెటర్తో లవ్ మ్యారేజ్:పెళ్లి దుస్తుల్లో బ్యాట్ పట్టి..క్రీజ్లో
ఈ మేరకు పార్టీ అధినేత శరద్ పవార్తో మంతనాలు కూడా పూర్తయ్యాయి. ఎన్సీపీలో చేరడానికి ముహూర్తం కూడా ఖాయం చేసుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు శరద్ పవార్, అజిత్ పవార్ సమక్షంలో తాను ఎన్సీపీలో చేరనున్నట్లు వెల్లడించారు. మహారాష్ట్రలో అధికారంలో మహా వికాస్ అగాఢీ సంకీర్ణ కూటమి ప్రభుత్వంలో ఎన్సీపీ భాగస్వామి. శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమి మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
ఫలితంగా- ఏక్నాథ్ ఖడ్సేకు ఎన్సీపీ తరఫున మంత్రిపదవి దక్కే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. తాను బీజేపీకి రాజీనామా చేయడానికి ప్రధాన కారణం.. మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడ్నవిస్ ప్రధాన కారణమని ఆయన ఆరోపించారు. ఫడ్నవిస్ వల్ల తన రాజకీయ జీవితం నాశనమైందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఫడ్నవిస్ వైఖరి వల్ల పలువురు సీనియర్ నేతలు అసంతృప్తితో ఉన్నారని ఆరోపించారు. తన తరువాత మరికొందరు సీనియర్ నేతలు రాజీనామా చేసే అవకాశం లేకపోలేదని చెప్పారు.
Recommended Video
ఇదివరకు ఫడ్నవిస్ ప్రభుత్వంలో ఆయన వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు. సుదీర్ఘకాలం పాటు ఆయన బీజేపీలో కొనసాగారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన తనకు బదులుగా కుమార్తె రోహిణీ ఖడ్సే ఖెల్వాల్కర్ను నిలబెట్టారు. ఆమె ఓడిపోయారు. ముక్తయ్ నగర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన రోహిణీ ఖడ్సే.. స్వతంత్ర అభ్యర్థి చంద్రకాంత్ నింబా పాటిల్ చేతిలో ఓటమి పాలయ్యారు. తన కుమార్తె ఓటమికి దేవేంద్ర ఫడ్నవిస్ లోపాయకారిగా పనిచేశారని, స్వతంత్ర అభ్యర్థిని గెలిపించారనే అసంతృప్తి ఏక్నాథ్ ఖడ్సేలో వ్యక్తమైంది. అప్పటి నుంచీ ఆయన పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. ఇక ఎన్సీపీలో చేరడానికి సన్నాహాలు చేస్తున్నారు.