మీదారి మీదే, మాదారి మాదే: గవర్నర్ తో బీజేపీ, శివసేన వేర్వేరుగా భేటీ, మధ్యలో మరాఠీ !
ముంబై: మహారాష్ట్ర రాజకీయం రసవత్తరంగా మారుతోంది. మీదారి మీదే, మాదారి మాదే అంటూ శివసేన, బీజేపీ లీడర్స్ గవర్నర్ తో భేటీ అయ్యారు. మహారాష్ట్రలో బీజేపీ-శివసేన మధ్య అధికారం మార్పిడి విషయంలో చిచ్చు దీపావళి జువ్వులా ఎగిరిపడింది. అధికారం పంచుకోవడంలో 50-50 ఫార్ములాకు తాము కట్టుబడి ఉన్నామని శివసేన తేల్చి చెప్పింది. అయితే శివసేన డిమాండ్ ను బీజేపీ మాత్రం ఇంత వరకు అంగీకరించినట్లు లేదు. మహారాష్ట్రలో అధికారం పంచుకునే విషయంలో శివసేన- బీజేపీ మధ్య వివాదాం మరింత పెరిగే అవకాశం ఉందని తెలిసింది. అయితే శివసేన పార్టీ చీఫ్ ఉద్దవ్ ఠాక్రే కుమారుడు, ఎమ్మెల్యే ఆదిత్య ఠాక్రేని తాము కచ్చితంగా సీఎం చేస్తామని, అందులో ఎలాంటి అనుమానం లేదని ఆ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు తేల్చి చెబుతున్నారు.
మహారాష్ట్రకు కాబోయే ముఖ్యమంత్రి ఆదిత్య ఠాక్రే, మాత్రోశ్రీ మాస్టర్ ప్లాన్, ముంబైలో కలకలం !
శివసేన ముందడుగు
సోమవారం (ఈరోజు) ఉదయం 10.30 గంటలకు తము గవర్నర్ (మహారాష్ట్ర) భగత్ సింగ్ కొశ్యారీని కులుస్తామని శివసేన పార్టీ సీనియర్ నాయకుడు దివాకర్ రౌత్ అన్నారు. గవర్నర్ భగత్ సింగ్ కొశ్యారీతో మా పార్టీ నాయకులు చర్చలు జరపనున్నారని దివాకర్ రౌత్ చెప్పారు. అయితే ఇదే రోజు ఉదయం 11 గంటలకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గవర్నర్ భగత్ పింగ్ కొశ్యారీని కలుస్తారని బీజేపీ వర్గాలు స్పష్టం చేశారు. ముందుగా చెప్పినట్లు శివసేన నాయకుడు దివాకర్ రౌత్ రాజ్ భవన్ చేరుకున్నారు.
శివసేనకు మొదటి చాన్స్
గవర్నర్ భగత్ సింగ్ కొశ్యారీని కలవడానికి శివసేన ముందడుగు వేసింది. గవర్నర్ భగత్ సింగ్ కొశ్యారీని మీరు ముందు కలవండి, మీకే ఫస్ట్ చాన్స్ అంటూ బీజేపీ వర్గాలు అన్నాయి. శివసేన మనసులో ఏముంది అనే విషయం గవర్నర్ కు తెలుస్తోందని, తరువాత మనం ఆయన్ను కలిస్తే అన్ని విషయాలు తెలుస్తాయని బీజేపీ అనుకుంటోంది. అందుకే శివసేన నాయకులు గవర్నర్ ను కలిసిన తరువాత కలవడానికి బీజేపీ నాయకులు ప్లాన్ వేశారు.
శివసేన చాలెంజ్
శివసేన చీప్ ఉద్దవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రేను 2.5 ఏళ్లు ముఖ్యమంత్రి చెయ్యాలని శివసేన నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఎలాంటి రాజకీయ అనుభవం లేని వ్యక్తిని, మొదటి పారి ఎమ్మెల్యే అయిన ఆదిత్య ఠాక్రేని ఎలా సీఎం చెయ్యాలని బీజేపీ నాయకులు అంటున్నారు. ఇదే సమయంలో బీజేపీ, శివసేన నాయకులు స్వతంత్ర పార్టీ ఎమ్మెల్యేలను ఆకర్షించి తమవైపు తిప్పుకోవడానికి పోటీ పడుతున్నారు.
శివసేన వేడి పుట్టిస్తోంది
మహారాష్ట్రలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 105 స్థానాల్లో, శివసేన 56 స్థానాల్లో విజయం సాధించింది. ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడానికి 145 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 122 స్థానాల్లో, శివసేన 63 స్థానాల్లో విజయం సాధించాయి. అయితే 2014తో పొలిస్తే 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, శివసేన సీట్లు తగ్గిపోయాయి.
మరాఠీ మీడియా జోస్యం
ప్రస్తతం బీజేపీ, శివసేన తీరుతో మరాఠీ రాజకీయం రసవత్తరంగా మారింది. ఇదే సమయంలో మరాఠీ మీడియా కొత్త పొత్తు తెరమీదకు వస్తోందని జోస్యం చెబుతోంది. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమి ఊహించని రీతిలో పుంజుకుంది. ఒకవేళ శివసేనకు బీజేపీ మద్దతు ఇవ్వకుంటే శరద్ పవార్ తన సత్తా చూపించడానికి సిద్దం అయ్యారని మరాఠీ మీడియా అంటోంది. బీజేపీకి మద్దతు ఇవ్వకుండా శివసేన బయటకు వస్తే ఆ పార్టీకి ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు మద్దతు ఇవ్వడానికి సిద్దం అయ్యాయని మరాఠీ మీడియా అంటోంది.