సుశాంత్ సింగ్ డెత్ కేసులో కీలక పరిణామం: రియా చక్రవర్తికి ఊరట..కానీ: పాస్పోర్ట్ స్వాధీనం
ముంబై: దేశవ్యాప్తంగా ప్రకంపనలను సృష్టించిన బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ డెత్ కేసు.. దీనిపై దర్యాప్తు సందర్భంగా వెలుగులోకి వచ్చిన బాలీవుడ్ డ్రగ్స్ కుంభకోణంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. బాలీవుడ్ డ్రగ్స్ కేసులో అరెస్టయిన నటి రియా చక్రవర్తికి బెయిల్ లభించింది. ఈ మేరకు బోంబే హైకోర్టు కొద్దిసేపటి కిందటే ఆదేశాలు జారీ చేసింది. రియా చక్రవర్తికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తున్నట్లు వెల్లడించింది.
Recommended Video
తెలంగాణలో మళ్లీ పెరుగుదల బాట పట్టిన వైరస్: వ్యాధుల సీజన్ ఎఫెక్ట్?: గ్రేటర్ సహా: ఆ రెండు చోట్ల
ఇదే కేసులో అరెస్టయిన రియా చక్రవర్తి సోదరుడు షోవిక్ చక్రవర్తికి బెయిల్ లభించలేదు. ఆయన దాఖలు చేసుకున్న బెయిల్ పిటీషన్ను బోంబే హైకోర్టు కొట్టి వేసింది. ఫలితంగా షోవిక్ చక్రవర్తి మరి కొద్దిరోజుల పాటు నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారుల విచారణలో కొనసాగక తప్పని పరిస్థితి నెలకొంది. ఇదే కేసులో అరెస్టయిన మరో ఇద్దరికి బోంబే హైకోర్టు నుంచి బెయిల్ మంజూరు అయింది. డ్రగ్ పెడ్లర్గా పేరున్న అబ్దుల్ బాసిత్కు బెయిల్ మంజూరు చేయలేదు న్యాయస్థానం.
సుశాంత్ సింగ్ రాజ్పుత్ డెత్ కేసులో ప్రధాన నిందితురాలిగా ఆరోపణలను ఎదుర్కొంటున్నారు రియా చక్రవర్తి. ఇదివరకు కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ ఆమెను అదుపులోకి తీసుకుని విచారించింది. సుశాంత్ సింగ్ డెత్ కేసులో డ్రగ్స్ కోణం వెలుగులోకి రావడంతో నార్కొటిక్స్ కంట్రోల్ బ్యురో అధికారులు ఈ కేసును తమ ఆధీనంలోకి తీసుకున్నారు. పలుమార్లు విచారించిన తరువాత.. రియా చక్రవర్తిని అరెస్టు చేశారు.
రియాతో పాటు ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి, శామ్యుల్ మిరిండా, దీపేష్ సావంత్, అబ్దుల్ బాసిత్ సహా పలువురిని ఎన్సీబీ అధికారులు అరెస్టు చేశారు. కస్టడీలోకి తీసుకున్నారు. విచారణ కొనసాగుతున్న సమయంలోనే.. రియా చక్రవర్తి బెయిల్ కోసం బోంబే హైకోర్టును ఆశ్రయించారు. ఆమె తరఫు న్యాయవాది బెయిల్ పిటీషన్ను దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన బోంబే హైకోర్టు ఆమెకు బెయిల్ను మంజూరు చేసింది.
లక్ష రూపాయల వ్యక్తిగత పూచీకత్తును అందించాలని ఆదేశించింది. అలాగే- వరుసగా 10 రోజుల పాటు పోలీస్ స్టేషన్లో సంతకాలు చేయాలని న్యాయమూర్తులు పేర్కొన్నారు. పాస్పోర్టును పోలీస్ స్టేషన్లో జమ చేయాల్సి ఉంటుందని, న్యాయస్థానం అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లకూడదని సూచించారు. గ్రేటర్ ముంబైని వదిలి వెళ్లాల్సిన అవసరం ఏర్పడితే.. ఈ విషయాన్ని న్యాయస్థానానికి, దర్యాప్తు అధికారికి తప్పనిసరిగా ముందస్తు సమాచారాన్ని ఇవ్వాల్సి ఉంటుందని న్యాయమూర్తులు ఆదేశించారు.