తండ్రి ముఖ్యమంత్రి..కుమారుడు మంత్రి: పట్టుబట్టి.. అజిత్ కు లక్కీ ఛాన్స్.. !
ముంబై: మహారాష్ట్రలో మంత్రివర్గ విస్తరణ పూర్తయింది. శివసేన-నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ-కాంగ్రెస్ లతో కూడిన మహా వికాస్ అఘాఢి కూటమికి చెందిన పలువురు శాసనసభ్యులను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఊహించినట్టే- ఎన్సీపీ సీనియర్ నాయకుడు అజిత్ పవార్ కు ఉప ముఖ్యమంత్రి పదవి దక్కింది. ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే కుమారుడు ఆదిత్య థాకరేకు కేబినెట్ లోకి తీసుకున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిత్య థాకరే వర్లీ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. అసెంబ్లీకి తొలిసారిగా ఎన్నికయ్యారు.
వారితో పాటు మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్, ధనంజయ్ ముండే, దిలీప్ వల్సే-పాటిల్, విజయ్ వడేట్టివర్, అనిల్ దేశ్ ముఖ్, హసన్ ముష్రీఫ్, వర్షా గైక్వాడ్, రాజేంద్ర షింగణె, నవాబ్ మాలిక్ వంటి పలువురు సీనియర్ శాసనసభ్యులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
రాజ్ భవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి వారితో ప్రమాణ స్వీకారాన్ని చేయించారు. తాజాగా చోటు చేసుకున్న విస్తరణతో మహారాష్ట్ర కేబినెట్ మొత్తం మంత్రుల సంఖ్య 36కు చేరింది. 32 రోజుల వ్యవధిలో మహారాష్ట్రలో మంత్రివర్గాన్ని విస్తరించడం ఇది రెండోసారి.
Shiv Sena's Aaditya Thackeray takes oath as minister in Maharashtra Government. pic.twitter.com/ammdFNEuO1
— ANI (@ANI) December 30, 2019
పట్టుబట్టి సాధించుకున్న అజిత్..
ఉప ముఖ్యమంత్రి పదవిని అజిత్ పవార్ పట్టుబట్టి సాధించుకున్నారు. మహా వికాస్ అఘాడి కూటమి సారథ్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమంటూ జరిగితే ఎన్సీపీ తరఫున ఉప ముఖ్యమంత్రి పదవిని అజిత్ పవార్ కే కేటాయించాలని ముందుగానే నిర్ణయం తీసుకున్నారు. అదే సమయంలో- ఆయన రాత్రికి రాత్రి భారతీయ జనతా పార్టీకి తన మద్దతు ప్రకటించడం, గవర్నర్ ను కలిసి 54 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్టు లేఖ ఇవ్వడంతో పరిస్థితులు తారుమారు అయ్యాయి. బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైంది.
దేవేంద్ర ఫడ్నవిస్ ముఖ్యమంత్రిగా, అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన నాలుగే నాలుగు రోజుల్లో అజిత్ పవార్ తన పదవికి రాజీనామా చేశారు. తన వెంట వచ్చే ఎమ్మెల్యేలెవరూ లేకపోవడంతో ఆయన అనూహ్యంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఫలితంగా- దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం కుప్పకూలిపోయింది. ఫలితంగా- శివసేన సారథ్యంలో మహావికాస్ అఘాడి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు బాటలు పడ్దాయి.
కిందటి నెల 28వ తేదీన మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ థాకరే ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ ల నుంచి ఇద్దరు చొప్పున ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. తాజాగా- దీన్ని విస్తరించారు. అజిత్ పవార్, అశోక్ చవాన్, నవాబ్ మాలిక్ వంటి హేమాహేమీలను మంత్రివర్గంలోకి తీసుకున్నారు.
మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారిలో కేసీ పాడ్వీ, విజయ్ వడేట్టివర్, అమిత్ దేశ్ ముఖ్, సునీల్ కేదార్, యశోమతి ఠాకూర్, వర్షా గైక్వాడ్, అస్లామ్ షేఖ్, అజిత్ పవార్, ధనంజయ్ ముండే, జితేంద్ర అవ్హాద్, దిలీప్ వల్సే పాటిల్, హసన్ ముష్రీఫ్, శివసేన నుంచి సంజయ్ రాథోడ్, ఆదిత్య థాకరే, అనిల్ పరబ్, సునీల్ రౌత్, ఉదయ్ సామంత్, భాస్కర్ జాధవ్, గులాబ్ రావు పాటిల్, దాదా భూసే, రాజేష్ తోపె తదతరులు ఉన్నారు.