మహా మంత్రుల శాఖలు..తుది జాబితా కాస్సేపట్లో: అజిత్ పవార్ కు ఆర్థికం.. ఆదిత్య థాకరేకు..?
ముంబై: మహారాష్ట్రలో తాజా చోటు చేసుకున్న మంత్రివర్గ విస్తరణ సందర్భంగా ప్రమాణ స్వీకారం చేసిన నేతలకు శాఖలకు గురువారం సాయంత్రానికి శాఖలను కేటాయించే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు మరి కాస్సేపట్లో విడుదల కానుంది. ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ కు కీలక శాఖలను కేటాయించనుంది ఉద్ధవ్ థాకరే సర్కార్. ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆయనకు ఆర్థిక మంత్రిత్వ శాఖ బాధ్యతలను అప్పగించడం దాదాపు ఖాయమైంది.
ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే కుమారుడు, ఎమ్మెల్యేగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆదిత్య థాకరేకు పర్యాటకం, పర్యావరణ మంత్రిత్వ శాఖలను కేటాయించినట్లు చెబుతున్నారు. కేబినెట్ లో నంబర్ టూగా చెప్పుకొనే హోం మంత్రిత్వ శాఖకు అనిల్ దేశ్ ముఖ్ ను నియమించినట్లు తెలుస్తోంది. శాఖల కేటాయింపునకు సంబంధించిన జాబితా ఒకటి ప్రస్తుతం అనధికారికంగా వెల్లడైంది. దీనిపై ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ఇంకా ఆమోదముద్ర వేయాల్సి ఉంది.
ఈ జాబితా ప్రకారం.. అజిత్ పవార్-ఆర్థికం, ప్రణాళికలు, అనిల్ దేశ్ ముఖ్-హోం, జయంత్ పాటిల్-నీటి పారుదల, దిలీప్ వల్సే పాటిల్-కార్మిక సంక్షేమం, ఎక్సైజ్, చవన్ భుజ్బల్-ఆహరం, పౌర సరఫరాలు, ఆదిత్య థాకరే-పర్యాటకం, పర్యావరణం, ఏక్ నాథ్ షిండే-పట్టణాభివృద్ధి, సుభాష్ దేశాయ్-పరిశ్రమలు, బాలాసాహెబ్ థొర్రట్-రెవెన్యూ, అశోక్ చవాన్-పీడబ్ల్యూడీ, అమిత్ దేశ్ ముఖ్-పాఠశాల విద్య లేదా విద్యుత్, నితిన్ రౌత్- విద్యుత్, యశోమతి ఠాకూర్-మహిళా, శిశు సంక్షేమం, నవాబ్ మాలిక్-మైనారిటీ వ్యవహారాలు, జితేంద్ర అవ్హాద్-గృహ నిర్మాణం శాఖలను కేటాయించినట్లు తెలుస్తోంది.
దాదాపు ఇదే జాబితాను ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ఖరారు చేయొచ్చని అంటున్నారు. వ్యవసాయం సహా మరి కొన్ని మంత్రిత్వ శాఖలపై స్పష్టత రాలేదు. పూర్తి జాబితా ఈ సాయంత్రానికి వెలువడటం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే మూడు రోజులైనప్పటికీ మంత్రులకు శాఖలను కేటాయించలేదంటూ భారతీయ జనతా పార్టీ నాయకులు విమర్శిస్తోన్న నేపథ్యంలో.. సాయంత్రానికి తుది జాబితా వెలువడుతుందని చెబుతున్నారు. అమిత్ దేశ్ ముఖ్ కేటాయించిన విద్యుత్ శాఖను నితిన్ రౌత్ కు బదలాయించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.