రూ. 3కే మాస్కులు, ఎన్95 రూ. 49కే: ధరలు తగ్గించిన తొలి రాష్ట్రం ఇదే
ముంబై: మహారాష్ట్రలో కరోనా కరాళ నృత్యం చేస్తున్న విషయం తెలిసిందే. దేశ్యంలోనే అత్యధిక మరణాలు, కరోనా పాజిటివ్ కలిగిన రాష్ట్రాల్లో మొదటి స్థానంలో ఉంది మహారాష్ట్ర. ఇప్పటికే కరోనా కేసులు అధికంగానే నమోవుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా కట్టడిలో ముఖ్యపాత్ర పోషిస్తున్న మాస్కుల ధరలపై కీలక నిర్ణయం తీసుకుంది.
మనుషులపై కరోనా వ్యాక్సిన్ ప్రయోగం: ఎదురయ్యే సవాళ్లేంటీ? ఎలా అధిగమించాలి? బ్రిటన్ ఘనత
రూ. 3-4కే మాస్కులు, ఎన్95 రూ. 49
మాస్కులను అధిక ధరకు విక్రయించకూడదంటూ మహారాష్ట్ర ప్రభుత్వం తాజాగా మార్గదర్శకాలను విడుదల చేసింది. రెండు, మూడు పొరలున్న మాస్కులను రూ. 3 నుంచి రూ. 4కే విక్రయించాలని స్పష్టం చేసింది. ఇక నాణ్యతను బట్టి ఎన్95 మాస్కులను రూ. 19 నుంచి రూ. 49 మధ్యలోనే విక్రయించాలని ఆదేశాలు జారీ చేసింది.
మాస్కుల ధరలు నియంత్రించిన తొలి రాష్ట్రం..
కాగా, మాస్కుల ధరలను నిర్ణయించిన తొలి రాష్ట్రం మహారాష్ట్రనే కావడం గమనార్హం. ఈ సందర్భంగా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ తోపే మాట్లాడారు. కరోనా సంక్రమణను కట్టడి చేసేందుకు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా మాస్కులు ధరించాలని అన్నారు. మాస్కులు ధరించనివారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు.
మాస్కుల ధరల తగ్గింపు అందుకే..
ఈ నేపథ్యంలోనే అందరికీ అందుబాటులో ఉండేవిధంగా మాస్కుల ధరలను తగ్గించినట్లు తెలిపారు. ఈ నిర్ణయానికి ఇప్పటికే ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే ఆమోదం తెలిపారన్నారు. రాష్ట్రంలో అంటువ్యాధుల చట్టం అమలులో ఉన్నంతకాలం తయారీ సంస్థలు, పంపిణీదారులు, విక్రేతలు ఈ మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. వచ్చేది పండగల సీజన్ కావడంతో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
మహారాష్ట్రలోనే కరోనా కేసులు ఎక్కువ..
మహారాష్ట్రలో ఇప్పటి వరకు 16,09,516 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా,13,92,308 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 1,74,265 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. 42,453 మంది కరోనా బారినపడి మరణించారు. మహారాష్ట్రలో ఇప్పటికీ రోజుకు దాదాపు 10వేల కొత్త కేసులు నమోదవుతున్నాయి. అయితే, కోలుకుంటున్నవారి సంఖ్య కూడా పెరుగుతుండటం ఊరటనిచ్చే అంశంగా చెప్పవచ్చు. ఇక దేశ వ్యాప్తంగా 76లక్షలకుపైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 67 లక్షల మందికిపైగా కోలుకున్నారు. లక్షా 15వేల మంది మరణించారు. ప్రస్తుతం ఏడు లక్షల 40వేల యాక్టివ్ కేసులున్నాయి.
Recommended Video