పొలిటికల్ గేమ్: మహారాష్ట్ర గవర్నర్తో ఉద్ధవ్ థాకరే భేటీ: మండలికి ఎంపికపై వీడని సస్పెన్స్..
ముంబై: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కల్లోలాన్ని సృష్టిస్తోన్న వేళ.. మహారాష్ట్రలో సరికొత్త రాజకీయ అంకానికి తెర తీసే పరిస్థితులు నెలకొన్నాయి. దేశంలో నమోదైన కరోనా వైరస్ కేసుల్లో అత్యధిక వాటా మహారాష్ట్రదే. ముంబై సహా ఆ రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో కరోనా చెలరేగిపోతోంది. వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు అక్కడ నమోదు అయ్యాయి. ఇలాంటి పరిస్థితుల మధ్య మహారాష్ట్ర గవర్నర్ ఉద్ధవ్ థాకరే.. రాజ్భవన్ గడప తొక్కడం ప్రాధాన్యతను సంతరించుకుంది. శుక్రవారం ఉదయం ఆయన రాజ్భవన్కు వెళ్లారు. గవర్నర్ భగత్ సింగ్ కోష్యారితో భేటీ అయ్యారు.
వైసీపీ ఎమ్మెల్యేలు చేసిన పని.. వారిని హైకోర్టు మెట్లెక్కేలా చేస్తోందిగా: పిల్ దాఖలు చేసిన అడ్వొకేట్
మహారాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని..
నిజానికి- గవర్నర్తో ఉద్ధవ్ థాకరే భేటీ కావడానికి గల కారణం వేరే. మే 1వ తేదీ మహారాష్ట్ర ఆవిర్భావం దినోత్సవం. 1960 మే 1వ తేదీ నాడు మహారాష్ట్ర ఆవర్భవించింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఉద్ధవ్ థాకరే గవర్నర్ను మర్యాదపూరకంగా కలిశారు. ఆయనకు శుభాకాంక్షలను అందజేశారు. అదే సమయంలో- ఇంకో ప్రతిపాదనను కూడా ఉద్ధవ్ థాకరే.. గవర్నర్ ముందు ఉంచారు. అవే ఎమ్మెల్సీ ఎన్నికలు. ఎమ్మెల్యేల కోటా కింద తనను శాసన మండలికి ఎంపిక చేయాలంటూ ఉద్ధవ్ థాకరే ఇదివరకే రాజ్భవన్కు ప్రతిపాదనలను పంపించారు. దానిపై గవర్నర్ ఇంకా ఎలాంటి నిర్ణయాన్నీ తీసుకోకపోవడం అనేక పరిణామాలకు దారి తీస్తోంది.
ఏ సభలోనూ సభ్యుడు కాని ఉద్ధవ్
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పగ్గాలను అందుకున్న ఉద్ధవ్ థాకరే ప్రస్తుతం అటు అసెంబ్లీలో గానీ ఇటు కౌన్సిల్లో గానీ సభ్యుడు కాదు. ముఖ్యమంత్రిగా లేదా మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న నాయకుడు.. ఆరు నెలల వ్యవధిలో ఈ రెండింట్లో ఏదో ఒక సభకు ఎంపిక కావాల్సి ఉంటుంది. ఈ ఆరు నెలల గడువు ప్రస్తుతం సమీపించింది. గత ఏడాది నవంబర్ 28వ తేదీన ఉద్ధవ్ థాకరే ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నెల 28వ తేదీలోగా ఆయన శాసన సభకు లేదా శాసన మండలికి ఎంపిక కావడం అనివార్యం. ఈ నేపథ్యంలో- తనను గవర్నర్ లేదా ఎమ్మెల్యేల కోటా కింద శాసన మండలికి ఎంపిక చేయాలని కోరుతూ ఇదివరకే ఆయన రాజ్భవన్కు ప్రతిపాదనలను పంపించారు.
గవర్నర్తో భేటీ సందర్భంగా..
తన కోటాలో ఎవరిని శాసన మండలికి ఎంపిక చేయాలనే విషయంపై సర్వాధికారాలు గవర్నర్కే ఉంటాయి. ఈ నేపథ్యంలో.. గవర్నర్ కోష్యారితో భేటీ సందర్భంగా ఉద్ధవ్ థాకరే ఈ ప్రతిపాదల విషయాన్ని ప్రస్తావించినట్లు తెలుస్తోంది. తనను శాసన మండలికి ఎంపిక చేయాలని మరోసారి నేరుగా గవర్నర్ను విజ్ఙప్తి చేశారని, దీనికి ఆయన ఎలాంటి సమాధానాన్ని ఇవ్వలేదని అంటున్నారు. ఫలితంగా- మరి కొద్దిరోజుల పాటు దీనిపై ఉత్కంఠత కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే విషయంపై ఉద్ధవ్ థాకరే ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కూడా ఫోన్ చేశారు.
తొమ్మిది స్థానాలు ఖాళీ..
ప్రస్తుతం మహారాష్ట్ర శాసన మండలిలో తొమ్మిది స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అవన్నీ ఎమ్మెల్యేల కోటా కింద భర్తీ కావాల్సినవే. ప్రస్తుతం మహారాష్ట్రలో అధికారంలో ఉన్న మహా అఘాడి కూటమికి సారథ్యాన్ని వహిస్తోన్న శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలకు అయిదు స్థానాలు దక్కే అవకాశం ఉంది. వాస్తవానికి- ఖాళీ అయిన ఈ స్థానాలకు ఎన్నికలను నిర్వహించాల్సి ఉంది. కరోనా వైరస్ను దృష్టిలో ఉంచుకుని ఎన్నికలను వాయిదా వేసింది. ఈ పరిస్థితుల్లో తనను గవర్నర్ కోటా కింద శాసన మండలికి ఎంపిక చేయాలని ఉద్ధవ్ థాకరే విన్నవించారు. గవర్నర్ కోటా ఎంపిక చేసే వారికి ఎన్నికలను నిర్వహించాల్సిన అవసరం ఉండదు.