రైతులకు గుడ్న్యూస్, రూ.2 లక్షల వరకు రుణమాఫీ, రైతుల హర్షం, ప్రతిపక్షం ఫైర్...
ఔను.. రైతులకు మరాఠా ప్రభుత్వం తీపికబురు అందజేసింది. రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ప్రకటించింది. సెప్టెంబర్ 30 2019 వరకు రూ.2 లక్షల వరకు ఉన్న రుణం మాఫీ చేస్తామని పేర్కొన్నది. మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాకరే ప్రకటన రైతులు హర్షం వ్యక్తం చేశారు. శీతాకాల అసెంబ్లీ సమావేశాల ముగింపు రోజున సీఎం ఉద్దవ్ థాకరే కీలక ప్రకటన చేశారు.
రూ.2 లక్షలు..
రైతుల పంట రుణం రూ.2 లక్షలు, అంతకన్నా ఎక్కువగా ఉంటే.. దానిని మహాత్మా జ్యోతిరావు పూలే రుణమాఫీ కింద పరిగణిస్తామని చెప్పారు. అంతేకాదు నిర్ణీత సమయంలో లోన్ చెల్లించే రైతుల కోసం ప్రత్యేక పథకం రూపొందిస్తున్నట్టు ఉద్దవ్ థాకరే ప్రకటించారు.
నో కండీషన్స్..
రైతుల రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం షరతులు విధించలేదని ఆర్థికమంత్రి జయంత్ పాటిల్ పేర్కొన్నారు. రుణమాఫీకి సంబంధించి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు. సంబంధిత అధికారులు రైతులకు రుణమాఫీ గురించిన వివరాలు అందజేస్తారని వెల్లడించారు.
చెప్పిందొకటి..
రుణమాఫీపై ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్ పెదవి విరిచారు. ఎన్నికల సమయంలో శివసేన చెప్పిన రుణమాఫీ వేరు అని, ప్రకటించిన విధానం వేరు అని పేర్కొన్నారు. దీంతో ఇచ్చిన హామీని అమలు చేయడంలో శివసేన ప్రభుత్వం విఫలైమందని మండిపడ్డారు. అంతేకాదు వర్షాభావ పరిస్థితుల పంట నష్టపోయిన రైతులకు హెక్టార్కు రూ.25 వేలు ఇస్తానని చెప్పిన ప్రకటన ఏమైందని దేవేంద్ర ఫడ్నవీస్ ప్రశ్నించారు. రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వ తీరును నిరసిస్తూ ప్రతిపక్ష బీజేపీ వాకౌట్ చేసి.. వెళ్లిపోయింది.