లాక్డౌన్ టు బీ కంటిన్యూ: అన్లాక్ 1.0 ఫెయిలైతే తప్పదు, ‘మహా’ సీఎం ఉద్దవ్ ఇండికేషన్స్...
దేశంలో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. ఎక్కువగా మహారాష్ట్రలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అక్కడ పాజిటివ్ కేసుల సంఖ్య 90 వేల మార్క్ దాటింది. మృతుల సంఖ్య 3 వేల పైచిలుకు గానే ఉంది. లాక్ డౌన్ 5.0 నిబంధనల సడలింపులు.. అన్ లాక్ 1.0తో మాల్స్, రెస్టారెంట్లు కూడా తెరిచిన సంగతి తెలిసిందే. దీంతో పాజిటివ్ కేసులు పెరుగుతున్న సీఎం ఉద్దవ్ థాకరే కీలక వ్యాఖ్యలు చేశారు.
అన్ లాక్ 1.0తో పరిస్థితి చేయి దాటితే.. తిరిగి లాక్ డౌన్ విధించే అవకాశం ఉంది అని ఉద్దవ్ థాకరే ఇండికేషన్ ఇచ్చారు. పరిస్థితి చేయిదాటే సిచుయేషన్ వస్తే.. సంపూర్ణ లాక్ డౌన్ విధించేందుకు వెనకాడబోమని తేల్చిచెప్పారు. వాస్తవానికి ప్రమాదం ఇంకా దాటిపోలేదని.. కానీ ఆర్థిక కార్యకలాపాలకు ఇబ్బంది కలుగొద్దని అన్ లాక్ 1.0 కొనసాగుతోందని స్పష్టంచేశారు.
లాక్ డౌన్ను దశలవారీగా విధించామని.. ఎత్తివేసే ప్రాసెస్ కూడా అలానే ఉంటుందని ఉద్దవ్ చెప్పారు. కానీ ప్రమాదం పొంచి ఉందని.. ఈ క్రమంలో ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాల్సిన అవసరం ఉంది అని అభిప్రాయపడ్డారు. కరోనాతో పోరాడుతూనే.. సడలింపులు తప్పడం లేదు అని పరోక్షంగా అంగీకరించారు. కానీ ఈ ఆపత్కాలంలో తమ వెంట ఉన్న ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం విధించిన నియమాలను తూచ తప్పకుండా పాటించారని పేర్కొన్నారు. ఇప్పుడు కూడా రద్దీగా ఉండొద్దని, భౌతికదూరం పాటించాలని ఉద్దవ్ కోరారు.