విధేయతకే పట్టం: మహా సీఎల్పీ నేతగా గాంధీ కుటుంబం విశ్వసనీయుడు
ముంబై: సోనియాగాంధీ కుటుంబం పట్ల విధేయతగా ఉన్నవారికి పార్టీలో అవలీలగా పదవులు అందుతాయనడానికి తాజా ఉదాహరణ ఇది. మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బాలాసాహెబ్ థొరట్ కే శాసన సభా పక్ష పగ్గాలు కూడా దక్కాయి. బాలా సాహెబ్ థొరట్ ను ఏకగ్రీవంగా తమ నాయకుడిగా ఎన్నుకున్నారు పార్టీ శాసన సభ్యులు. కాంగ్రెస్ సభా పక్ష నాయకుడిని ఎంపిక చేయడానికి మంగళవారం ఆ పార్టీ ఎమ్మెల్యేలు సమావేశం అయ్యారు. పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీమంత్రి మల్లికార్జున ఖర్గే, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్, పృథ్వీరాజ్ చవాన్ తదితరులు దీనికి హాజరయ్యారు.
ఈ సమావేశంలో మల్లికార్జున ఖర్గే.. సీఎల్పీ నేతగా థొరట్ పేరును ప్రతిపాదించగా.. అశోక్ చవాన్ బలపరిచారు. మిగిలిన శాసన సభ్యులు ఏకగ్రీవంగా ఆయనను ఎన్నుకున్నారు. ప్రస్తుతం మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ఆయన ఒక్కరే అత్యంత సీనియర్ ఎమ్మెల్యే.
మొన్నటి ఎన్నికల్లో ఆయన అహ్మద్ నగర్ జిల్లాలోని సంగమనేర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. 1985 నుంచీ మొన్నటి వరకు జరిగిన అన్ని అసెంబ్లీ ఎన్నికల్లోనూ థొరట్.. అప్రతిహతంగా విజయాన్ని సాధిస్తూ వస్తున్నారు. 1985లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు. ఈ తరువాత కాంగ్రెస్ లోొ చేరారు.
గాంధీ కుటుంబానికి అత్యంత విధేయుడిగా పేరుంది. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీలకు అత్యంత సన్నిహితుడిగా చెబుతారు. సోనియాగాంధీకి కుడిభుజంగా చెప్పుకొనే అహ్మద్ పటేల్ ను థొరట్.. తన రాజకీయ గురువుగా భావిస్తుంటారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ.. పార్టీకి విధేయుడిగా ఉండటం, ఇప్పుడున్న ఎమ్మెల్యేల్లో అత్యంత సీనియర్ కావడం వల్లే సీఎల్పీగా నేతగా ఎన్నికయ్యారని చెబుతున్నారు. కాంగ్రెస్ నిబంధనలకు వ్యతిరేకంగా థొరట్ కు జోడు పదవులకు ఎంపిక చేశారని అంటున్నారు.