అమితాబ్, అక్షయ్ కుమార్ల సినిమాలు, షూటింగ్లు అడ్డుకుంటాం: మహా కాంగ్రెస్ వార్నింగ్
ముంబై: రోజు రోజుకు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రముఖ బాలీవుడ్ అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్ స్పందించకపోవడంపై మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు నానా పటోలే ప్రశ్నించారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. మండిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలపై తమ వైఖరేంటో చెప్పాలని డిమాండ్ చేశారు.
లేదంటే బిగ్ బీ అమితాబ్, అక్షయ్ కుమార్ సినిమాలు, షూటింగ్లను మహారాష్ట్రలో అడ్డుకుంటామని హెచ్చరించారు. అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్ గతంలో మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం హయాంలో పెట్రోల్ ధరలు పెరిగితే ట్వీట్లు చేశారని గుర్తు చేశారు. కానీ, ఇప్పుడు మాత్రం ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు.
పెట్రోల్ ధరల పెరుగుదలతో సామాన్యులపై తీవ్ర ప్రభావం పడుతోందన్నారు పటోలే. నరేంద్ర మోడీ ప్రభుత్వం అన్యాయంగా పెంచుతున్న పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై అమితాబ్, అక్షయ్ కుమార్ ఒక వైఖరి తీసుకోకపోతే వారి సినిమాలను, షూటింగ్లను రాష్ట్రంలో అనుమతించబోమని వ్యాఖ్యానించారు.
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై గతంలోలాగే ఇప్పుడూ వారి పాత్ర ఉండాలన్నారు. టోల్ గేట్ల వద్ద ఫిబ్రవరి 15 నుంచి ఫాస్టాగ్ తప్పనిసరి చేయడంపై ఆయన మండిపడ్డారు. వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. కాగా, ప్రస్తుతం ముంబైలో లీటర్ పెట్రోల్ ధర 96.32గా ఉండగా, డీజిల్ ధర రూ. 87.32గా ఉంది. ఇక రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో పెట్రోల్ లీటర్ ధర రూ. 100కు చేరడం గమనార్హం.