శివసేన ట్రాప్ లో కాంగ్రెస్: వాళ్ల తప్పు మన మీద: అసమ్మతి నేత!
ముంబై: మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి శివసేనకు మద్దతు ఇచ్చే దిశగా అఖిల భారీత కాంగ్రెస్ పార్టీ (ఏఐసీసీ) అడుగులు వేస్తుండటం, ఈ అంశంపై రెండు రోజులుగా ఎడతెగని చర్చలు నిర్వహించడం పట్ల అసమ్మతి నాయకులు మండిపడుతున్నారు.
ఇప్పటిదాకా కాంగ్రెస్ లో తన అసమ్మతి గళాన్ని వినిపిస్తూ వస్తోన్న సీనియర్ నాయకుడు సంజయ్ నిరుపమ్ కు తోడుగా మరో ఇద్దరు మహారాష్ట్ర నాయకులు గొంతు వినిపిస్తున్నారు. వారంతా సంజయ్ నిరుపమ్ అనుచరులుగా అనుమానిస్తున్నారు. ఆయన ప్రోత్సాహంతోనే కాంగ్రెస్ పార్టీపై అసమ్మతిని వ్యక్తం చేస్తున్నట్లు చెబుతున్నారు.
Congress has no moral responsibility to form a govt in Maharashtra. Putting any blame on us for the instability is meaningless.
— Sanjay Nirupam (@sanjaynirupam) November 12, 2019
Its the failure of BJP and ShivSena which has brought the state on the doorstep of President rule.#MaharashtraPoliticalCrisis
మహారాష్ట్రలో చోటు చేసుకుంటున్న పరిణామాల్లో సంజయ్ నిరుపమ్ ఎక్కడా జోక్యం చేసుకోవట్లేదు. అశోక్ చవాన్ వంటి సీనియర్ నేతలు ఆయనను ఆహ్వానించినప్పటికీ.. వాటిని తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఆదివారం నుంచి వరుసగా ఆయన పార్టీ అధిష్ఠానంపై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు.
తాజాగా మరోసారి పార్టీ చర్యలపై విరుచుకుపడ్డారు. శివసేనతో చేతులు కలిపే నైతిక బాధ్యత గానీ, హక్కు గానీ కాంగ్రెస్ పార్టీకి లేవని విమర్శించారు. క్రమంగా పార్టీ క్యాడర్ మొత్తం శివసేన ట్రాప్ లో పడుతోందని హెచ్చరించారు. శివసేనకు మద్దతు ఇవ్వడానికి కంటే ముందే మేల్కొనాలని సూచించారు.
మహారాష్ట్ర ప్రస్తుతం రాష్ట్రపతి పాలన ముంగిట నిల్చోవడానికి భారతీయ జనతాపార్టీ-శివసేనలే కారణమని సంజయ్ నిరుపమ్ విమర్శించారు. రాష్ట్రపతి పాలన విధించడమంటూ జరిగితే దానికి ఈ రెండు పార్టీలే బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు.
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ.. అది అస్థిరత్వానికే దారి తీస్తుందని జోస్యం చెప్పారు. ఈ అస్థిరత్వానికి కాంగ్రెస్ పార్టీ సమాధానాన్ని ఇచ్చుకోవాల్సి ఉంటుందని, భవిష్యత్తులో జరిగే ఎన్నికలపై దీని ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ-శివసేనలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాలని అన్నారు.