మహారాష్ట్రలో కరోనా విలయ తాండవం: 30వేల మార్క్ దాటిన కేసులు, ముంబైలో కలకలం
ముంబై: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి కరాళ నృత్యమే చేస్తోంది. గత 24 గంటల్లోనే 1606 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 30వేల మార్క్ దాటింది. ఈ ఒక్కరోజులోనే 67 మంది మరణించారని ప్రభుత్వం తెలిపింది.
శనివారం ఒక్క రోజులోనే ముంబైలో కొత్తగా 884 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ముంబైలో మొత్తం కేసుల సంఖ్య 18,555కు చేరింది. ముంబైలో శనివారం ఒక్కరోజులోనే 41 మంది మరణించారు. దేశ ఆర్థిక రాజధానిలో ఇప్పటి వరకు కరోనాతో 696 మంది ప్రాణాలు కోల్పోయారు.
తాజాగా 524 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 7088కి చేరింది. మహారాష్ట్రలో ప్రస్తుతం 22,479 యాక్టివ్ కేసులున్నాయి. ముంబైలో శనివారం ఒక్కరోజే 238 మంది డిశ్చార్జ్ అయ్యారు. మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఇప్పుడు 30,706కు చేరింది.
కాగా, దేశంలో ఇప్పటి వరకు 90,409 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 33,928 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 53,614 మంది బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటి వరకు దేశంలో 2,862 మంది ప్రాణాలు కోల్పోయారు.