మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఈజీ కాదు .. కరువే కొంప ముంచుతుందా?
త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో మహారాష్ట్ర లో అధికారం చేజిక్కించుకోవడం బిజెపికి అంత సునాయాసం కాదని తెలుస్తోంది. మహారాష్ట్ర లో వచ్చిన కరువుకాటకాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న తరుణంలో ప్రభుత్వంపై వ్యతిరేకత నెలకొంది. ఈసారి మహారాష్ట్రలో బీజేపీకి అంత సానుకూల పవనాలు వీచటం లేదు. 15 స్థానాలు సాధిస్తే గొప్పే అన్న చందంగా ఉంది మహారాష్ట్రలో అధికార పార్టీ అయిన బీజేపీ పరిస్థితి.
మహారాష్ట్రలో బీజేపీ కి ఈ దఫా కష్టమే
మహారాష్ట్రలో ఇప్పటిలాగానే శివసేనతో జతకట్టిన బీజేపీ కిందటిసారి 48 సీట్లలో 23 సీట్లు గెలుచుకుంది. గతంలో కాషాయ కూటమిలో భాగమైన స్వాభిమానీ షేట్కారీ సంఘటన ఈసారి ప్రతిపక్షాలతో చేతులు కలపడానికిసిద్ధమౌతోంది. నాలుగేళ్లకు పైగా బీజేపీ-శివసేన సంకీర్ణ ప్రభుత్వం రాష్ట్రంలో నడుస్తోంది. మహారాష్ట్ర ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేఖత వల్ల ఈ దఫా కాషాయపక్షానికి 15 సీట్లు వస్తే గొప్పే అన్న భావన వ్యక్తమవుతోంది.
కరువు నివారణా చర్యలపై ప్రజల అసంతృప్తి.. 24వేల గ్రామాల్లో కరువు కరాళనృత్యం
మహారాష్ట్రలో ఈసారి బిజెపి ప్రభుత్వం చాలా కష్టతరమైన సవాళ్లను ఎదుర్కొంటోందని బిజెపి పార్టీ అంతర్గత వర్గాలు భావిస్తున్నాయి. రాష్ట్రంలో మొత్తం 40 వేల 193 గ్రామాలలో 24 వేల గ్రామాలలో కరువు కరాళ నృత్యం చేసింది. మహారాష్ట్రలోని 48 లోక్సభ స్థానాలలో, 27 స్థానాలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. తీవ్ర కరువు కాటకాలతో ఇబ్బంది పడిన ప్రజలు ప్రభుత్వంపైనా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతాలలోని ప్రజలను తమ వైపుకు మరల్చుకుని ప్రయత్నం చేస్తుంది బిజెపి. అందులో భాగంగా రెండు ప్రధాన అంశాలతో ప్రజల్లోకి వెళ్లబోతోంది.
రైతాంగానికి 24 వేల కోట్ల రుణాలమాఫీ , 7500 కోట్లతో ప్రాజెక్టుల నిర్మాణం అంశాలతో ప్రజల్లోకి వెళ్ళాలని ఆలోచన
రైతాంగాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వం 24 వేల కోట్ల వ్యవసాయ రుణాలను మాఫీ చేసిందని, దీనివల్ల 51 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరిందని ప్రచారం చేయాలని నిర్ణయించింది. అలాగే 7,500 కోట్ల రూపాయలతో జల యుక్త్ శివారులో దాదాపు ఐదు లక్షల ప్రాజెక్టుల నిర్మాణం చేసినట్లుగా ప్రచారం చేయాలని, కరువు పరిస్థితులు వివరించడంతోపాటు, దానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలను నిజాయితీగా ప్రజల ముందుంచాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ బిజెపి కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. కరువుకాటకాలతో మహారాష్ట్ర ప్రజానీకం ఇబ్బంది పడింది అనే విషయాన్ని నిజాయితీగా చెప్పడంతో పాటుగా ప్రజాసంక్షేమం కోసం బీజేపీ ప్రభుత్వం పాటుపడిందని , చాలా వ్యయప్రయాసలకోర్చి పని చేసిందని చెప్పాలని సూచించారు.
రుణమాఫీ , ప్రాజెక్టులు , కేంద్ర సాయం .. బీజేపీని గట్టెక్కిస్తాయా ?
ఇక కేంద్రం నుండి 10 , 800 కోట్ల కరువు సహాయ నిధి అందించారని , అంతే కాకుండా కేంద్ర ప్రభుత్వం రైతులకు ఆరు వేల రూపాయలను అందిస్తూ ఆదుకునే ప్రయత్నం చేస్తుందని ప్రచారంలో భాగంగా చెప్పానని నిర్ణయం తీసుకుంది బిజెపి.
ఏది ఏమైనప్పటికీ మహారాష్ట్రలో నెలకొన్న కరువు పరిస్థితుల నేపథ్యంలో నివారణ చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం విఫలమైందని వ్యతిరేకత వస్తున్న తరుణంలో ఈసారి మహారాష్ట్రలో బిజెపి గెలుపు అంత సునాయాసంగా కాదనే చర్చ పార్టీలో అంతర్గతంగా సాగుతోంది.