వైరల్ : నన్నే ప్రశ్నిస్తావా?.. విద్యార్థిపై మంత్రి ఆగ్రహం.. రచ్చ రచ్చ
ముంబయి : ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రశ్నించడం నేరమా? ప్రజల ఓట్లతో గెలిచిన నాయకులకు ఫిర్యాదు చేయడం పాపమా? ఇలాంటి ప్రశ్నలకు ఓ మంత్రి చేసిన ఘనకార్యం అవుననే సమాధానం ఇస్తోంది. మహారాష్ట్ర విద్యాశాఖ మంత్రి వినోద్ టావ్డే.. ఓ విద్యార్థి అడిగినదానికి సమాధానం చెప్పకుండా విసుక్కున్నారు. అంతేకాదు ఆ తతంగం వీడియో తీస్తున్న మరో విద్యార్థిని అరెస్ట్ చేయాలంటూ చిర్రుబుర్రులాడుతూ పోలీసులను ఆదేశించారు. దీంతో ఈ వివాదం కాస్తా వైరల్ గా మారింది.
మంత్రిగారి కోపం.. అసహనం, నిర్లక్ష్యం..!
అమరావతిలోని శ్రీ శివాజీ ఆర్ట్స్ అండ్ కామర్స్ కాలేజీలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వచ్చారు విద్యాశాఖ మంత్రి వినోద్ టావ్డే. అయితే సమావేశం ముగిసి ఆయన వెళ్లిపోతున్న క్రమంలో ఓ స్టూడెంట్ ఆయన దగ్గరకొచ్చాడు. హయ్యర్ ఎడ్యుకేషన్ కాస్ట్లీగా మారడమే గాకుండా భారంగా పరిణమిస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు. దీనికి నచ్చజెప్పే రీతిలో సమాధానం చెప్పకుండా.. కోపంతో పాటు అసహనం వ్యక్తం చేశారు మంత్రి. అంతేకాదు చదువుకునే స్థోమత లేకుంటే పనిచేసుకోవాలంటూ నిర్లక్ష్యంగా మాట్లాడారు.
వీడియో తీస్తుంటే..!
విద్యార్థికి, మంత్రికి మధ్య జరుగుతున్న సంభాషణను మరో స్టూడెంట్ వీడియో తీస్తూ కనిపించాడు. దీంతో ఆగ్రహానికి గురైన మంత్రి ఆ విద్యార్థిని అదుపులోకి తీసుకోండంటూ పోలీసులను ఆదేశించారు. అంతేకాదు అతడి ఫోన్లో నుంచి ఆ వీడియో తీసివేయాల్సిందిగా హెచ్చరించారు. ఆ విద్యార్థిని పోలీస్ స్టేషన్ కు తరలించే క్రమంలో మిగతా స్టూడెంట్స్ అడ్డుకోవడంతో చివరకు విడిచిపెట్టారు. అయితే ఈ విషయం కాస్తా వివాదస్పదం కావడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అలా చెప్పలేదే..! మంత్రి వివరణ
విద్యార్థుల విషయంలో జరిగిన వ్యవహారంపై విమర్శలు వెల్లువెత్తడంతో మంత్రి సమాధానమిచ్చారు. అరెస్టు చేయమని పోలీసులకు తాను చెప్పలేదన్నారు. దాదాపు రెండు గంటలకు పైగా ఆ కాలేజీ కార్యక్రమంలో పాల్గొన్నానని.. విద్యార్థులపై సదాభిప్రాయం లేకుంటే అన్నీ గంటలు అక్కడ ఎందుకుంటానని వ్యాఖ్యానించారు. ఒకతను వీడియో తీస్తుండటంతో లోపలికెళ్లి మాట్లాడుకుందామని చెప్పానే తప్పా.. అక్కడ జరిగిందేమీ లేదని చెప్పుకొచ్చారు.