గంగలో మునిగి చావండి: ప్రతిపక్షాలపై మోడీ మాటల తూటాలు
న్యూఢిల్లీ: పోలింగ్ గడువు సమీపిస్తున్న కొద్దీ మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభల్లో రాజకీయ నాయకుల విమర్శల దాడి తీవ్రమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం ఘాటు వ్యాఖ్యలకు దిగుతున్నారు. కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలను టార్గెట్ గా చేసుకుని ఆరోపణల తీవ్రతను పెంచారు. మహారాష్ట్ర అసెంబ్ల ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో భాగంగా బుధవారం ఆయన అకోలాలో బహిరంగ సభలో పాల్గొన్నారు. కాంగ్రెస్-నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నాయకులపై పదునైన విమర్శలు గుప్పించారు.. మాటల తూటాలను సంధించారు.
దేశంలో నెలకొన్న ఆర్థిక మాంద్యం, నిరుద్యోగం, వరుసగా మూత పడుతున్న పరిశ్రమలు వంటి అంశాల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే కేంద్ర ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ విషయాన్ని తెరపైకి తీసుకొచ్చిందని కాంగ్రెస్, ఎన్సీపీ నాయకులు చేసిన విమర్శలను మోడీ తిప్పి కొట్టారు. మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడానికో లేదా వాస్తవ పరిస్థితులను కప్పి పుచ్చడానికో జమ్మూ కాశ్మీర్ అంశంపై ఆధార పడాల్సిన అవసరం తమకు లేదని అన్నారు. అత్యంత సున్నితమైన కాశ్మీర్ వివాదాన్ని మహారాష్ట్ర, హర్యానా ఎన్నికలకు ముడి పెట్టి చూస్తోన్న కాంగ్రెస్, ఎన్సీపీ నాయకులు గంగలో మునిగి చావాలంటూ (డూబ్ మరో) నిప్పులు చెరిగారు.
జమ్మూ కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తిని కల్పించడానికి ఉద్దేశించిన ఆర్టికల్ 370ని రద్దు చేసి, ఆ రాష్ట్రాన్ని భారత్ లో మిగిలిన రాష్ట్రాలతో సమాన హక్కులను కల్పించడం పట్ల దేశం యావత్తూ గర్విస్తోందని మోడీ అన్నారు. ఆర్టికల్ 370ని రద్దు చేయడం మైలురాయిగా తాము భావిస్తున్నామని అన్నారు. ఛత్రపతి శివాజీ జన్మించిన గడ్ద మీద ఇలాంటి నాయకుల నుంచి హీనమైన ఆరోపణలు వెలువడటం తనను దిగ్భ్రాంతికి గురి చేస్తోందని అన్నారు. మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లో చరిత్ర పునరావృతం కాబోతోందని ధీమా వ్యక్తం చేశారు. ఈ రెండు ఎన్నికల్లోనూ తమ పార్టీ విజయం సాధిస్తుందని, అధికారంలోకి రావడానికి ప్రతిపక్షలు కలలు కనాల్సిందేనని ఎద్దేవా చేశారు.
మహారాష్ట్రకు చెందిన వీర్ సావర్కర్, జ్యోతిబాఫులే, సావిత్రి ఫులేలకు భారత రత్న కోసం ప్రభుత్వం సిఫారసు చేయడాన్ని సైతం కాంగ్రెస్, ఎన్సీపీ నాయకులు తప్పు పడుతున్నారని ఆరోపించారు. దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న వారికి రావడం ప్రతిపక్షాలకు ఇష్టం లేదని చెప్పారు. మహారాష్ట్రలో తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వీర్ సావర్కర్, జ్యోతిబాఫులేలకు భారతరత్న కోసం కేంద్రానికి సిఫారసు చేస్తుందని అన్నారు. ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. సమాజాన్ని ఉద్ధరించిన మహనీయుల పట్ల కూడా కాంగ్రెస్, ఎన్సీపీ నాయకులు అవమానకరంగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు.