మహారాష్ట్ర ఎన్నికలు: రాజ్ థాక్రేకు చేదు అనుభవం.. ఎంఎన్ఎస్కు దారుణమైన భంగపాటు
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు గతంలో మునుపెన్నడూ లేనంతగా హోరాహోరీగా జరిగాయి. శివసేనతో బీజేపీ జటకట్టగా, ఎన్సీపీతో కాంగ్రెస్ పొత్తుపెట్టుకొని ఎన్నికల బరిలోకి దిగింది. అయితే ఎలాంటి పొత్తులకు వెళ్లకుండా రాజ్ థాక్రే ఒంటరిగా పోటీ చేసి భంగపాటు గురయ్యారు. తాజా ఎన్నికల్లో ఏ ఒక్క స్థానంలో కూడా అధిక్యంలో కొనసాగినట్టు కనిపించడం లేదు. ఇంతకు ఈ వైఫల్యానికి కారణమిమంటే..
ఒంటరిపోరులో ఎంఎన్ఎస్
తాజా ఎన్నికల్లో మహారాష్ట్ర నవ్నిర్మాన్ సేన పార్టీ అధినేత రాజ్ థాక్రేకు ఒంటరి పోరుతో తలపడ్డారు. మొత్తం 288 సీట్లలో మహారాష్ట్ర అసెంబ్లీలో 101 సీట్లలో పోటీకి అభ్యర్థులను దింపారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా ఏ ఒక్క అభ్యర్థి కూడా ఎన్నికల్లో ప్రభావం చూపలేకపోయారు. ఈ ఎన్నికలు కీలకమైన తరుణంలో ఎంఎన్ఎస్ దారుణమైన ఫలితాలను సాధించడం పార్టీ శ్రేణులకు మింగుడు పడని విధంగా మారింది.
రాజ్ థాక్రేకు ఈడీ షాక్
మహారాష్ట్రలో ఉప ఎన్నికలు జరుగుతున్న సమయంలోనే రాజ్ థాక్రే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టోరేట్ విచారణ ఎదుర్కొనడం పార్టీకి గట్టి దెబ్బ తగిలిందనే వాదన రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నది. ఆగస్టులో ఈడీ విచారణకు ఆయన హాజరైన సంగతి తెలిసిందే. ఈ విచారణ కారణంగానే పార్టీని ముందుకు నడిపించలేకపోయారనే వాదన ఓ పక్క వినిపిస్తుండగా.. దిగ్గజాల పొత్తుల మధ్య ఎంఎన్ఎస్ అభ్యర్థులు సత్తా చాటలేకపోయారనే పేర్కొంటున్నారు.
ప్రజాదరణను ఓట్లుగా
మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో ఎదురైన ప్రతికూల పరిస్థితులను రాజ్ థాక్రే బాగానే ఎదుర్కొంటున్నట్టు కనిపించారు. తాను నిర్వహించిన ర్యాలీలకు భారీగా జన స్పందన లభించింది. తన ప్రసంగాలకు విశేషమైన రెస్పాన్స్ కనిపించింది. అయితే అలాంటి ప్రజాదరణను ఓట్లుగా ఎందుకు మారలేదనే విషయం ఇప్పడు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది.
గతంలో ఎంఎన్ఎస్ తీరు
2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన ఎంఎన్ఎస్ ఇతర రాజకీయ పార్టీలకు షాకిచ్చింది. తొలిసారే 13 సీట్లు గెలుచుకొని తన సత్తాను నిరూపించుకొన్నది. ఆ తర్వాత 2014లో పార్టీలో అనేక తప్పిద నిర్ణయాలు, అసమ్మతి కారణంగా అన్ని సీట్లను కోల్పోయింది. అప్పటి నుంచి రాజ్ థాక్రే పార్టీని బలపేతం చేసేందుకు ప్రయత్నించినా.. ఆ ప్రభావం తాజా ఎన్నికల్లో కనిపించలేదనేది స్పష్టమైంది.