కోవిడ్ ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం: 12 మంది సజీవ దహనం..అల్లకల్లోలం
ముంబై: వేల సంఖ్యలో పుట్టుకొస్తోన్న కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో మహారాష్ట్ర తల్లడిల్లుతోంది. అత్యధిక కేసులు..కరోనా సంబంధిత మరణాలతో అల్లాడుతోంది. ఇది చాలదన్నట్లు కోవిడ్ కేర్ సెంటర్లు, ఆసుపత్రుల్లో వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. మొన్నటికి మొన్న నాసిక్లోని జాకిర్ హుసేన్ ఆసుపత్రిలో ఆక్సిజన్ లీక్ కావడం వల్ల 24 మంది మరణించారు. ఈ ఘటన నుంచి తేరుకోక ముందే.. మరో ప్రమాదం చోటు చేసుకుంది.
పాల్ఘర్ జిల్లాలోని వసై-విరార్లో గల ఓ కోవిడ్ ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 12 మంది పేషెంట్లు మరణించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందనే వార్తలు ఉన్నాయి. విరార్ పశ్చిమ ప్రాంతంలో గల విజయ్ వల్లభ్ ఆసుపత్రి ఐసీయూలో ఈ ఘటన చోటు చేసుకుంది. మంటలు చెలరేగిన సమయంలో ఐసీయూలో మొత్తం 17 మంది కరోనా వైరస్ సోకిన పేషెంట్లకు చికిత్స అందిస్తున్నారు అక్కడి డాక్టర్లు.
నాలుగు అంతస్తుల భవనంలో ఈ ఆసుపత్రి కొనసాగుతోంది. రెండో అంతస్తులో ఐసీయూను ఏర్పాటు చేశారు. అక్కడే మంటలు చెలరేగాయి. అత్యవసర చికిత్స పొందుతున్న వారిలో 12 మంది మరణించినట్లు వసై-విరార్ మున్సిపల్ కార్పొరేషన్ కోవిడ్ కంట్రోల్ రూమ్ అధికారులు ధృవీకరించారు. ఐసీయూలో మంటలు చెలరేగిన వెంటనే సిబ్బంది పోలీసులు, రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగానికి సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న వారు మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
మొత్తం 10 ఫైరింజన్లతో మంటలను నియంత్రించారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మిగిలిన పేషెంట్లను మరో ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం సంభవించడానికి గల కారణాలేమిటనేది ఇంకా తెలియరాలేదు. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం సంభవించి ఉండొచ్చని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. పాల్ఘర్ జిల్లా కలెక్టర్ ఈ ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించారు. సమాచారం అందిన వెంటనే వసై-విరార్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షించారు.
#UPDATE 13 people have died so far in fire at COVID hospital in Virar, in Vasai Virar municipal limits, Palghar district
— ANI (@ANI) April 23, 2021
(Earlier visuals)#Maharashtra pic.twitter.com/KHTiSqbLMY